విశాఖ టీడీపీ నేతలకు వరుస షాక్: నిన్న గంటా..నేడు హర్ష: శ్రీకన్య ఫ్యుషన్ ఫుడ్స్.. సీజ్
విశాఖపట్నం: స్థానిక తెలుగుదేశం నాయకులకు వరుస షాక్లను ఇస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధీనంలో ఉన్న నాలుగు ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్న రెండోరోజే అదే పార్టీకి చెందిన మరో నేత హర్షకు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఓ రెస్టారెంట్ను ఖాళీ చేయించారు. అనంతరం రెస్టారెంట్ను సీజ్ చేశారు. లీజ్ గడువు ముగిసిన తరువాత కూడా అక్రమంగా కొనసాగిస్తున్నందున ఖాళీ చేయించాల్సి వచ్చిందని చెబుతున్నారు.
గంటా శ్రీనివాసరావు ఆక్రమించినట్లుగా అనుమానిస్తోన్న సింహాచలం భైరవవాక సమీపంలోని విజయ రామపురం అగ్రహారంలో నాలుగు ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ ప్రాంతంలో 124 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో 60 ఎకరాలపై న్యాయపరమైన వివాదాలు నడుస్తున్నాయి. కోర్టు చిక్కుల్లో ఉన్నాయి. మిగిలిన 64 ఎకరాలను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నాలుగు ఎకరాల స్థలం గంటా శ్రీనివాసరావు అధీనంలో ఉంది.
దీనిపై చెలరేగిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతుండగానే.. మరో నేత హర్షకు షాక్ ఇచ్చారు అధికారులు. సిరిపురంలో ఆయనకు చెందిన శ్రీకన్య ఫ్యుషన్ ఫుడ్స్ రెస్టారెంట్ను ఖాళీ చేయించారు. ఈ రెస్టారెంట్ను నెలకొల్పడానికి ఆయన గ్రేటర్ విశాఖకు చెందిన స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. దాని నిర్వహణ బాధ్యతలను మరొకరికి అప్పగించారు. నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా, రెన్యూవల్ లేకుండా శ్రీకన్య ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ను నడిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2015 తరువాత మళ్లీ రెన్యూవల్ చేయించుకోలేదని స్పష్టం చేస్తున్నారు.
ఈ రెస్టారెంట్ నిర్వహణ కోసం 2024 వరకూ లీజ్ ఉందని, నోటీసు ఇవ్వకుండా ఖాళీ చేయిస్తున్నారని యజమాని హర్ష వాదిస్తున్నారు. తాను టీడీపీ నేత కావడం వల్లే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు దిగుతోందని విమర్శిస్తున్నారు. అర్థరాత్రి పోలీసు బందోబస్తుతో వచ్చి రెస్టారెంట్ను ఖాళీ చేయించారని, ఇలాంటి దౌర్జన్యాల వల్ల విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక, వ్యాపార వేత్తలు భయపడతారని విమర్శించారు. తాను న్యాయపరంగా పోరాడుతానని చెప్పారు.