పెందుర్తిలో దారుణం- ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య- పాతకక్షతో కిరాతకంగా
విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో పాత కక్షలకు ఒకే కుటుంబంలోని ఆరుగురు బలయ్యారు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. రెండు కుటుంబాల మధ్య ఉన్న కక్షలే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇద్దరు చంటి పిల్లలతో సహా ఆరుగురిని పొట్టనబెట్టుకున్న హంతకుడు బత్తిన అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఉరితీయాలంటూ పెందుర్తిలో గ్రామస్దులు ఆందోళనకు దిగారు. దీంతో పోలిసులు రంగ ప్రవేశం చేసి పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.
ఆరు హత్యలతో ఉలిక్కిపడ్డ పెందుర్తి
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో రెండు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరి మధ్య పరస్పరం గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆవేశం ఆపుకోలేక మరో కుటుంబానికి చెందిన ఆరుగురిని ఒకేసారి హతమార్చాడు. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో పెందుర్తి మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో జరిగిన ఆ ఆరు హత్యలతో జుత్తాడలో పరిస్ధితి భయానకంగా తయారైంది.
అత్యంత పాశవికంగా హత్యలు
పెందుర్తి మండలం జుత్తాడలోని బత్తిన, బొమ్మిడి కుటుంబాల మధ్య కొన్నిరోజులుగా వివాదాలు నెలకొన్నాయి. ఇదే క్రమంలో నిన్న రాత్రి బొమ్మిడి కుటుంబం ఇంట్లోకి చొరబడిన హంతకుడు బత్తిన అప్పలరాజు ఆ ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురిని ఎడపెడా కత్తితో నరుకుతూ హతమార్చాడు. మాటు వేసి ఇంట్లోకి చొరబడిన తర్వాత అందిన వారిని అందినట్లు నరికేశాడు. ఈ క్రమంలో చిన్నారుల్ని కూడా వదిలిపెట్టలేదు. పదునైన కత్తి కావడం, హంతకుడు ఆవేశంలో ఉండటంతో కాళ్లూ, చేతులూ ఎక్కడ పడితే అక్కడ గాయాలతో ఆరుగురు చనిపోయారు.
Recommended Video
రక్తపు మడుగులో బొమ్మిడి కుటుంబం
నిందితుడు బత్తిన అప్పలరాజు దాడిలో తీవ్రంగా గాయపడిన బొమ్మిడి కుటుంబంలోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. వీరి శరీరాల నుంచి బయటికి వచ్చిన రక్తంలో ఆ ఇల్లు రక్తపు మడుగులా మారిపోయింది. హత్యకు గురైన వారిలో బొమ్మిడి రమణ (63), బొమ్మిడి ఉషారాణి (35), అల్లూరి రమాదేవి (53), నక్కెళ్ల అరుణ (37), బొమ్మిడి ఉదయ్ (2), బొమ్మిడి ఉర్విష (6 నెలలు) ఉన్నారు. ఈ హత్యలు చేసిన అనంతరం హంతకుడు అప్పలరాజు నేరుగా స్ధానిక పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గురైన కుటుంబం ఈ మధ్యనే విజయవాడ నుంచి పెందుర్తి వచ్చినట్లు తెలుస్తోంది.