జగన్! మరో ఉద్యమం తప్పదు: గ్యాస్ లీకేజీ, డాక్టర్ సుధాకర్ ఘటనపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
అమరావతి: ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విష వాయువు స్టైరిన్ ప్రజా జీవితంపై దుష్ప్రభావం చూపించినా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ్చేలా లేదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
స్టైరిన్ వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు, విష వాయువు ప్రభావిత ప్రాంత గ్రామాల ప్రజలకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే పోరాడతామని తెలిపారు.

మరో ఉద్యమం తప్పదు..
లాక్డౌన్ అనంతరం ప్రజా జీవితం సాధారణ స్థితికి వచ్చిన వెంటనే ఎల్జీ పాలిమర్స్ ప్రభావిత ప్రజల కోసం భవన నిర్మాణ కార్మికుల కోసం చేసిన తరహాలోనే ఉద్యమిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోమవారం విశాఖపట్నం జిల్లా నాయకులు, శ్రేణులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ దిశానిర్దేశం చేశారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.

వైద్యుడి పట్ల అలా వ్యవహరిస్తారా?
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "ప్రభుత్వంలో ఉన్నవారు హుందాగా, పెద్ద మనసుతో ఉండాలి. విశాఖపట్నం జిల్లాకు చెందిన అనస్తీషియా వైద్యులు డాక్టర్ సుధాకర్ విషయంలో ప్రభుత్వం పెద్ద మనసుతో వ్యవహరించి విధుల్లోకి తీసుకోవాలి. కరోనా విధుల్లో ఉన్నవారికి మాస్కులు లాంటివి లేవు అని చెబుతూ వాడిన పదజాలంపై అభ్యంతరాలు వచ్చాయి. ఆయన లేవనెత్తిన సమస్యను కూడా చూడాలి. డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేశారు... ఇటీవల విశాఖలో ఆయనపై చోటు చేసుకున్న ఘటన చూశాం. చట్ట ప్రకారం వెళ్తాం అనుకొనేటప్పుడు ఆ చట్టం అందరికీ సమానంగానే పని చేయాలి. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీలోనూ, బహిరంగ వేదికలపై అసభ్య పదజాలం వాడినప్పుడు, ఆ పార్టీ వాళ్ళు టీవీ చర్చల్లో నోరు పారేసుకున్నప్పుడు ఈ చట్టం ఎందుకు బలంగా పని చేయలేదు. కాకినాడలో ఓ ప్రజా ప్రతినిధి ఇలాగే మాట్లాడితే నిరసన తెలిపిన జనసేన నాయకులపైనే కేసులుపెట్టారు. ఆ రోజు నేను ఎదురు తిరగలేక కాదు హుందాగా ఉండాలనే సంయమనం పాటించాను. చట్టం బలవంతులపై బలహీనంగా, బలహీనులపై బలంగా ప్రయోగించడం సరికాదు' అని అన్నారు.

ఆశలు రేపి మభ్య పెడతారా?
ప్రజలు తమకు ప్రభుత్వం మంచి చేస్తుందని ఎదురుచూస్తారు... వారి ఆశలతో ప్రభుత్వం ఆటలాడుకోవడం భావ్యం కాదు. సంపూర్ణంగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన పార్టీ అధికారంలోకి వచ్చాక ఏమి చేస్తుందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. కేవలం అధికారం కోసమే అలాంటి హామీలు ఇచ్చారనిపిస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలోనూ ఈ విధమైన ఆశలు రేపి ప్రజలను మభ్యపెట్టకూడదు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందో లేదో గమనిస్తూ అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో మన నాయకులు, శ్రేణులు పరిశీలిస్తూ ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

దేశానికి కీలకమైన విశాఖలో ఇలానా..?
విలువైన ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు సిద్ధమైంది. ఆ భూముల వాస్తవ విలువలు ఏమిటి, వేలం వెనక అసలు వ్యవహారం ఏమిటో ప్రజలకు తెలియాలి. కరోనా మూలంగా ఆర్థికంగా ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చాయని అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మన పార్టీ నాయకులు ప్రజల సమస్యలపై బలంగా స్పందించాలి. ప్రభుత్వ భూముల వేలం, అధిక విద్యుత్ బిల్లులు, మద్యం అమ్మకాలుపై నాయకులందరూ చర్చించుకొని సమష్టిగా క్షేత్ర స్థాయి నుంచి పోరాడాలి. విశాఖపట్నం రాష్ట్రానికి గుండె లాంటిది. అంతేకాదు మన దేశ రక్షణకు సంబంధించి ఈ నగరం కీలకమైనది. అలాంటి నగరంలో చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన ఆందోళనకరమైనది. ఆ పరిశ్రమ నుంచి విడుదలైన విష వాయువు స్టైరిన్ ప్రభావం ఇంకా ఎంత కాలం, ఏ స్థాయిలో ఉంటుందో అన్న భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు' అని పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసైనికులు ప్రజలకు చేస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు.

ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారు..
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. "కరోనా ప్రభావం ఉండగానే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఆ దుష్ప్రభావం ఇప్పటికీ ప్రజలను భయపెడుతూనే ఉంది. ఆ ప్రభావం 3కి.మీ. వరకూ ఉంటుందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిధిని 600 మీటర్లకే కుదించారు. ఈ అంశంపై నాయకులు దృష్టిపెట్టాలి. ప్రభుత్వం ఉన్న ఆస్తులను వేలం వేసి అమ్మేస్తోంది. విశాఖపట్నంలో సైతం విలువైన భూములను అమ్మకానికి పెట్టేసింది. దీనిపై ఇప్పటికే మన పార్టీ నేతలు నిరసన తెలుపుతున్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో సైతం ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక జ్వరాల బారినపడుతున్నారు. తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications