ప్రధాని మోదీతో వేదికను పంచుకోబోయేది వీరే..!!
విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కోసం విశాఖపట్నం సిద్ధమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు వ్యవహారాలు.. వంటి అంశాల మధ్య విశాఖపట్నానికి రాబోతోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే సమయంలో- ప్రధానితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కాబోతోండటం అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకొంది.
షెడ్యూల్లో..
ప్రధాని పర్యటనలో అనూహ్యంగా జాప్యం చోటు చేసుకుంది. గంట పాటు ఆలస్యంగా ఆయన విశాఖ పర్యటన ఆరంభం అయింది. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ సాయంత్రం 7:25 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఐఎన్ఎస్ చోళ వరకు రోడ్ షోగా తరలి వెళ్తారు. రాత్రి 8:00 గంటలకు మోదీ హోటల్కు చేరుకుంటారు. రాత్రి 8:00 నుంచి రాత్రి 8:30 గంటల వరకు బీజేపీ కోర్ కమిటీ ప్రతినిధులతో సమావేశమౌతారు. 8:30 నుంచి 8:40 నిమిషాల వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ షెడ్యూల్ అయింది.
మార్పులు..
ఇందులో స్వల్పంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. గంట పాటు ఆలస్యంగా ఆయన విశాఖకు వచ్చారు. తమిళనాడులోని మధురై నుంచి విశాఖకు బయలుదేరాల్సిన ప్రత్యేక విమానం- వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలస్యంగా బయలుదేరింది. ప్రస్తుతం తమిళనాడు దక్షిణ ప్రాంతం, పుదుచ్చేరిల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. విమానం టేకాఫ్ తీసుకోవడానికి అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల ఈ జాప్యం ఏర్పడింది.
విశాఖకు..
కాగా- రాత్రి 8:15 నిమిషాలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్ షోగా ప్రధాని మోదీ ఐఎన్ఎస్ చోళకు బయలుదేరి వెళ్లారు. రోడ్ షో సందర్భంగా వందలాదిమంది విశాఖవాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఒక పక్కన నిల్చుని మోదీకి జైకొట్టారు. కటౌట్లను ప్రదర్శించారు.
పలు ప్రాజెక్టులు..
10,500 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి, మరి కొన్నింటికి శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ విశాఖకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యామ్నం బెంగళూరు, సాయంత్రం తమిళనాడులో పర్యటించిన అనంతరం ఆయన విశాఖకు చేరుకున్నారు. విజయవాడ-గుడివాడ-భీమవరం-నిడదవోలు, గుడివాడ-మచిలీపట్నం-భీమవరం-నర్సాపురం మధ్య 221 కిలోమీటర్ల మేర డబ్లింగ్, విద్యుదీకరణ పూర్తిచేసుకున్న రైలు మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.
రైల్వే పనులకూ..
2,917 కోట్ల రూపాయలతో ఓఎన్జీసి ఈస్టర్న్ షోర్లో అభివృద్ధి చేసిన యూ-ఫీల్డ్ను అందుబాటులోకి తీసుకొస్తారు. 211 కోట్ల రూపాయలతో పాతపట్నం-నరసన్న పేటలను కలుపుతూ నిర్మించిన జాతీయ రహదారిని ప్రారంభిస్తారు మోదీ. 460 కోట్ల రూపాయలతో తలపెట్టిన విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 3,778 కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టిన రాయ్పూర్ - విశాఖ ఆరు లేన్ల గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మాణానికీ భూమిపూజ చేస్తారాయన.
ఈ ముగ్గురికే..
ఆయా పనుల కోసం నిర్వహించదలిచిన వేదికల మీద పరిమితంగా నాయకులు ఆసీనులు కానున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రమే వేదికలపై కనిపిస్తారు. ఈ ముగ్గురికి మాత్రమే వేదికపైకి రావడానికి ఆహ్వానం అందింది.