వారి నిర్లక్ష్యం వల్లే ఇదంతా .. దేవాదాయ శాఖలోని అధికారులపై స్వరూపానందేంద్ర వ్యాఖ్యలు
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలోని అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వల్లనే అన్ని రకాల అనర్థాలు జరుగుతున్నాయని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. అర్చకుల వేతనాలు 15 వేల రూపాయలకు పెంచేందుకు ఏపీ లోని ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వలన ఆలస్యం అవుతోందని స్వరూపానంద తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య నిర్వహించిన బ్రహ్మ యజ్ఞ స్మార్త సభకు హాజరైన స్వరూపానందేంద్ర సరస్వతి అర్చకులు, వేదపండితుల జీవితాలు గాలిపటాల్లా తయారయ్యాయని, వారిని, వారి కుటుంబాలను రక్షించటం ఎలా అన్న ఆలోచనలోనే శారదా పీఠం ఉందని ఆయన పేర్కొన్నారు. పౌరోహిత్యా న్ని బ్రాహ్మణుల కులవృత్తిగా గుర్తించాలని ఆయన పేర్కొన్నారు . వచ్చే సంవత్సరం విశాఖ వేదికగా , అర్చకులు ,పురోహితులు, వేద బ్రాహ్మణులు , పండితులతో భారీ సదస్సును నిర్వహిస్తామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. రాష్ట్రంలో వేదం పండితుల , బ్రాహ్మణుల , అర్చకుల సమస్యలకు ఒక పరిష్కార మార్గం వెతుకుతామని చెప్పారు .
వేదపండితులకు భృతి పెంచటానికి ,అర్చకుల వంశ పారంపర్య హక్కు లు సాధించడానికి శారదా పీఠం కృషి చేస్తుందని స్వామీజీ పేర్కొన్నారు. ధార్మిక కార్యక్రమాలతో ప్రజలను ముందుకు నడిపించేది పురోహితులని, ధర్మాన్ని పరిరక్షించడంతో పాటు హైందవ జాతిని జాగృతం చేసేది బ్రాహ్మణులేనని స్వామిజీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వెబ్సైట్ను స్వామీజీ ఆవిష్కరించారు.