విశాఖ వైపు తొలి అడుగు పడింది - తరలింపు మొదలు పెట్టిన వైసీపీ
అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అధికార వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచింది. ఒకవంక కొత్త బిల్లుపై కసరత్తు పూర్తి చేస్తూనే మరోవంక- నిర్మాణాలకూ పూనుకుంది. ఇదివరకు సభలో ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న తరువాత.. దాని స్థానంలో మరొకటి ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో మరో కీలక అడుగు వేసింది అధికార పార్టీ. పార్టీ పరంగా తరలింపు పనులను మొదలు పెట్టింది కూడా.

స్టే ఇచ్చిన జోష్..
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా ఆదేశాలు కూడా వైసీపీ ప్రభుత్వానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆరు నెలల్లోగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలంటూ గతంలో ఏపీ హైకోర్టు.. ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం ఇటీవలే తాత్కాలికంగా స్టే మంజూరు చేసింది. రాజధాని ఎక్కడ ఉండాలనే విషయాన్ని న్యాయస్థానాలు నిర్దేశించలేవనీ కుండబద్దలు కొట్టింది.

కేంద్రం గ్రీన్ సిగ్నల్..
పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చని, వాటి సంఖ్యను పెంచుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం కూడా ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్.. రాజ్యసభలోనూ దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. ఎక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమనీ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.

విశాఖకు పార్టీ కేంద్ర కార్యాలయం..
ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో నిర్మిస్తోంది. ప్రస్తుతం రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ఉన్న ఈ కేంద్ర కార్యాలయాన్ని త్వరలో విశాఖపట్నానికి తరలించబోతోంది. ఎండాడ పనోరమా హిల్స్లో వైసీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మితం కానుంది.

భూమిపూజతో..
వైసీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణ పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. భూమి పూజతో నిర్మాణ పనులను మొదలు పెట్టారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజిని, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్యేలు ఆదిప్ రాజ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా భూమిపూజను నిర్వహించారు వైవీ సుబ్బారెడ్డి. ఆరు నెలల్లో పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

కొత్త సంవత్సరం ఆరంభంలోనే
అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. కొత్త సంవత్సరం ఆరంభంలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించేలా చర్యలను తీసుకుంటున్నామని అన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉత్తరాంధ్ర జిల్లాలను అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతంగా పేరున్న ఉత్తరాంధ్ర జిల్లాలను సమగ్రాభివృద్ధి కోసం విశాఖపట్నానికి పరిపాలన రాజధానిగా చేయబోతోన్నారని అన్నారు.

తొలగుతున్న చిక్కులు..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉన్న అడ్డంకులు, చిక్కులు ఒక్కటొక్కటిగా తొలగిపోతోన్నాయని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే జారీ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు. న్యాయపరమైన చిక్కులు తొలగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానులను వైఎస్ జగన్ ప్రకటించారని పేర్కొన్నారు.

త్వరలో బిల్లు..
మూడు రాజధానుల బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని వైఎస్ జగన్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే జారీ చేయడం, కేంద్రం నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడం వంటి అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల జాప్యం చేయకుండా సభలో బిల్లును ఆమోదించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీనికోసం త్వరలోనే సభను సమావేశపర్చే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications