ఆనందయ్య స్ఫూర్తితో: కరోనా విరుగుడు ఆయుర్వేద మందును తయారు చేసిన విశాఖ బాలుడు
విశాఖపట్నం: రాష్ట్రంలో కొద్దిరోజులుగా రోజూ చర్చల్లో నిలుస్తోన్న పేరు.. కృష్ణపట్నం ఆనందయ్య. రోజూ ఆయనకు సంబంధించిన వార్తలు మీడియాలో వెలువడుతోన్నాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడుగా ఆయుర్వేద మందును ఆనందయ్య కనిపెట్టడమే కారణం. దీనికి హైకోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో సోమవారం నుంచే ఈ మందు పంపిణీ పునఃప్రారంభమైంది. దీనిపట్ల జగన్ సర్కార్ కూడా సానుకూలంగా వ్యవహరిస్తోంది.
ఈ ఆయుర్వేద మందును తయారు చేయడానికి ఆనందయ్య అనుసరించే విధానాలు, దాన్ని రూపొందించడంలో వినియోగించే పదార్థాలు, ఇతర దినుసులు ఇవేనంటూ సోషల్ మీడియాలో కొంత సమాచారం సర్కులేట్ అవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకుని విశాఖపట్నం అన్నవరానికి చెందిన పొట్నూరు హరనాథ్ అనే బాలుడు.. ఆయుర్వేద మందును తయారు చేశాడు. ఆనందయ్యను స్ఫూర్తిగా తీసుకుని దాన్ని ప్రిపేర్ చేశానని చెబుతున్నాడా బాలుడు.

చోడవరం మండలం అన్నవరం గ్రామానికి చెందిన హరనాథ్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆయుర్వేద వైద్యంలో అనుభవం వున్న వెంకన్నపాలేనికి చెందిన కన్నయ్యశెట్టి సహకారం, ఆయన పర్యవేక్షణలో దాన్ని తయారు చేశాడు. ఆయుర్వేద మందు తయారు చేయడంలో తాటిబెల్లం, పిప్పళ్లు, అల్లం, గుంటకలవరాకు, నేల ఉసిరి, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు ఇతర దినుసులను ఉపయోగించాడు.
ఆనందయ్య మందు తయారీకి విద్యార్థి ఉత్సాహం చూపించడంతో తాము కూడా సహకారం అందించామని స్థానిక గణేష్ డిఫెన్స్ అకాడమి డైరెక్టర్ గణేష్ తెలిపారు. ఈ మందును విశాఖపట్నం జిల్లా ఆయుష్ అధికారులకు పంపిస్తామని, వారు అనుమతిస్తే.. స్థానికంగా దాన్ని కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు పంపిణీ చేయాలనేది తమ ఆలోచనగా గణేష్ పేర్కొన్నారు. అధికారుల అనుమతి తరువాతే తాము పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications