ఎల్జీ పాలిమర్స్కు సీఎం జగన్ వార్నింగ్.. సెటిల్మెంట్ నాటకమన్న టీడీపీ.. 20వేల మందికి తలా రూ.10వేలు..
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. ఆరు గ్రామాల్లో తీవ్ర విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థకు హెచ్చరికలు చేశారు. గ్యాస్ లీకేజీకి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, ఇకపై ఒళ్లు దగ్గరపెట్టుకుంటే తప్ప ఆ కంపెనీని అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎల్జీ కంపెనీపై చర్యల విషయంలో ఆయా కమిటీలు చేసే సిఫార్సులను బట్టి ముందుకు వెళతామని, రాబోయే రోజుల్లో చిన్నపాటి నిర్లక్ష్యాలకు కూడా తావు లేకుండా జాగ్రత్త వహిస్తామన్నారు.

బాధితులతో కాన్ఫరెన్స్..
తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం జగన్ సోమవారం విశాఖ గ్యాస్ ఘటనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఎల్జీ ప్లాంటు వద్ద కొనసాగుతోన్న రక్షణ చర్యలు, బాధితులకు అందుతోన్న సాహాయం తదితర వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్, ముఖ్య అధికారులతోపాటు గ్యాస్ బాధితులు, వారి కుటుంబీకులు కూడా సీఎంతో మాట్లాడారు.

ఖాతాల్లోకి డబ్బు జమ..
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదంలో చనిపోయిన 12 మంది కుటుంబాలకు రూ.1కోటి చొప్పున ఇప్పటికే పరిహారాన్ని చెల్లించారు. అలాగే, వెంటిలేటర్పై చికిత్స పొందిన, పొందుతున్న వారికి రూ.10 లక్షలు, ఆస్పత్రిల్లో 2, 3 రోజులు ఉండి చికిత్స చేయించుకున్న వారికి లక్ష రూపాయలు, ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేల సాయం అందజేశారు. వీళ్లతోపాటు ఆరు బాధిత గ్రామాల్లోని మొత్తం 20 వేల మంది ప్రజలకు తలో రూ.10 చొప్పున పరిహారంగా ఇచ్చారు. సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 10 వేలను ఆన్లైన్లో జమ చేశారు.

ఇచ్చింది చంద్రబాబే కానీ..
తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్లాంటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలోనే ఆ కంపెనీ పర్మిషన్లు పొందిందని, అయితే, దీనిపై తాను రాజకీయ విమర్శలు చేయబోనని, పరిష్కారలపై మాత్రమే శ్రద్ధ వహిస్తానని సీఎం వ్యాఖ్యానించారు. వెస్ట్రన్ దేశాల్లో ప్రమాదాలపై ఎలాగైతే స్పందిస్తారో.. విశాఖ ఘటనలోనూ ప్రభుత్వం అదే తీరుగా స్పందించి, నిమిషాల వ్యవధిలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చామని జగన్ గుర్తుచేశారు. ప్రజల్ని ఆదుకునే కార్యక్రమంలో పాలుపంచుకున్న అధికారుల నుంచి సామాన్యుల దాకా ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని చెప్పారు.

ప్రతిపక్షనేతగానే రూ.1 కోటి అడిగా..
‘‘విశాఖలో గ్యాస్ లీకేజీ ప్రమాదం గురించి తెలియగానే నాకు 2014నాటి ఓఎన్జీసీ ఘటన గుర్తుకొచ్చింది. అప్పటి ప్రమాదంలో ప్రజలు కాలి చనిపోయారు. ఓఎన్జీసీ 20లక్షలు, కేంద్రం 2 లక్షలు, రాష్ట్రం 3 లక్షలు కలిపి బాధితులకు రూ.25లక్షల పరిహారం ఇచ్చారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న నేను.. ఒక్కో కుటుంబానికి రూ.1కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాను. డబ్బులతో ప్రాణాలను వెనక్కి తీసుకురాలేము, కానీ ప్రమాదంపై ప్రభుత్వాలు స్పందించే తీరుతో ప్రజల్లో నమ్మకం ఏర్పడాలి. అదేసమయంలో ఇంకో సారి అలాంటి పొరపాట్లు చేయకుండా కంపెనీలకు భయం, బాధ్యత పెరగాలి''అని జగన్ తెలిపారు.
Recommended Video

ఎల్జీతో కుమ్మక్కు..
స్టెరీన్ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ప్రతిపక్ష టీడీపీ కొట్టిపారేసింది. ఎల్జీ పాలిమర్స్ సంస్థతో సెటిల్మెంట్ చేసుకునేందుకే జగన్ విశాఖ వచ్చాడని, ఎయిర్ పోర్టులోనే మతనాలు జరిపారని ఆరోపించింది. ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్నా విషవాయువు ప్రభావం ఇంకా పూర్తిగా తొలిగిపోలేదన్న తెలిపింది. జగన్ సీఎం అయిన తర్వాతే ఎల్జీ ప్లాంటు విస్తరణకు అనుమతులిచ్చారని, ప్రమాదానికి కూడా అదే కారణమైందని టీడీపీ విమర్శించింది.












Click it and Unblock the Notifications