ఉక్కుపై పోటాపోటీ: వైసీపీ మరో పాదయాత్ర: తనను తాను కాపాడుకునే యత్నం?: పేరు ఫిక్స్
విశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికంగా ఉంటూ వస్తోన్న విశఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిచబోతోన్నామంటూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ ముహూర్తంలో ప్రకటించిందో గానీ.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ దీని చుట్టే తిరుగుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పక్షాలు.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కేంద్రబిందువుగా చేసుకుని మరీ.. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. ప్రైవేటీకరణ ప్రతిపాదనలను అడ్డుకోవడంలో భాగంగా కేంద్రంపై ఒత్తిడిని తీసుకుని రావడాలనికి ఉపయోగపడాల్సిన ఆ ప్రణాళికలన్నీ.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎల్లుండి విశాఖలో భారీ ఉద్యమం..
గురువారం విశాఖపట్నంలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలను నిర్వహించబోతోన్న విషయం తెలిసిందే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు చెందిన 13 కార్మిక సంఘాలు ఏకీకృతం అయ్యాయి. ఐక్యంగా ఉద్యమించనున్నాయి. ఇప్పటికే నిరసన దీక్షలు, ప్రదర్శనలు, ఆందోళనలు, బైఠాయింపులతో వేడెక్కిన సాగరనగరం.. ఎల్లుండి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు లేకపోలేదు. అదేరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖపట్నం పర్యటనకు బయలుదేరి వెళ్లొచ్చని తెలుస్తోంది.

వ్యూహాత్మకంగా వైసీపీ
విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనల వ్యవహారంలో వైఎస్సార్సీపీ ఓ రకంగా కార్నర్ అయింది. ఈ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది, దాన్ని కేంద్రమే ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. వందశాతం మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి అవసరమైన ప్రతిపాదనలను రూపొందించింది. అయినప్పటికీ- ఈ వ్యవహారంలో అధికార పార్టీని దోషిగా నిలబెట్టడానికి టీడీపీ తనవంతు ప్రయత్నాలు సాగిస్తోంది. వ్యూహాత్మకంగా పావులను కదుపుతోంది.

పరిరక్షణ పోరాట యాత్ర..
మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడం, గురువారం నాటికి ఆందోళనలకు టీడీపీ మద్దతు పలకడం ఇందులో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ పరిస్థితుల మధ్య వైసీపీ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్రను చేట్టబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద ఆరంభమయ్యే ఈ ర్యాలీని వైసీపీ నేతలు పాదయాత్రగా కొనసాగించనున్నారు.

25 కిలోమీటర్ల మేర..
విశాఖపట్నం సెంట్రల్, ఈస్ట్, నార్త్, వెస్ట్ నియోజకవర్గాల మీదుగా ఈ ప్రదర్శన ఉంటుంది. మొత్తం 25 కిలోమీటర్ల మేర ఆ పార్టీ నేతల ఈ పరిరక్షణ పోరాటయాత్ర పేరుతో పాదయాత్రను నిర్వహించనున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, విజయసాయి రెడ్డి, జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇందులో పాల్గొనబోతోన్నారు.












Click it and Unblock the Notifications