విశాఖో మరో కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ- షిఫ్టింగ్ గడువు సమీపిస్తోన్న వేళ
విశాఖపట్నంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయాన్ని వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. అన్ని స్థానాల్లోనూ తాము గెలవబోతోన్నామని ధీమా వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల వేడి రాజుకుంది. మొత్తం 14 నియోజకవర్గాలకు మార్చిలో పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థులను ఎంపిక చేశాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే ఆయా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వారితో క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయ్యారు.
2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్స్ గా భావిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా పార్టీలన్నీ ఈ ఎమ్మెల్సీ పోల్స్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 14 ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో రెండు ఉపాధ్యాయులు, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన తొమ్మిది కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన కోటాకు చెందినవి. స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ విశాఖపట్నంలో మరో కార్యాలయాన్ని ప్రారంభించింది. మధురవాడలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్టీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ మధ్యాహ్నం దీన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు, ఎమ్మెల్సీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు.. ఇందులో పాల్గొన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం వైవీ సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తోన్నారని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో వైఎస్ జగన్ సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీలు ముందుగానే తమ ఓటమిని అంగీకరించాయని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications