జగన్కు భారీ బహుమతిని ప్రిపేర్ చేస్తోన్న ఉత్తరాంధ్ర..!!
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ తరఫున పార్టీ సీనియర్ నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు.
విశాఖపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తోన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అయిదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. మరో నాలుగింటికి ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.

ఉత్తరాంధ్ర పట్టు..
ఏపీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల కోసం మార్చి 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ పోటీలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ నుంచి వేపాడ చిరంజీవీరావు, పీవీఎన్ మాధవ్ బరిలో నిలిచారు.

సీమ నుంచి..
తూర్పు రాయలసీమలో వైసీపీ నుంచి పీ శ్యామ్ ప్రసాద రెడ్డి, టీడీపీ నుంచి కే శ్రీకాంత్ చౌదరి, బీజేపీ అభ్యర్థిగా ఎస్ దయాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమలో వైసీపీ నుంచి వెన్నపూస రవి, టీడీపీ తరఫున భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా నగురూరు రాఘవేంద్ర తలపడుతున్నారు.

సీతంరాజు గెలుపుకోసం..
ఉత్తరాంధ్ర నుంచి సీతంరాజు సుధాకర్ ను గెలిపించడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బరిలో దిగారు. పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటిస్తోన్నారు. సీతంరాజు గెలుపు కోసం కృషి చేస్తోన్నారు.

జగన్ కు గిఫ్ట్..
ఉత్తరాంధ్ర పట్టభద్రుల అభ్యర్థి సీతంరాజు సుధాకర్ను గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం జగన్ ఎంతో కష్టపడుతున్నారని, ఇందులో భాగంగా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చబోతోన్నారని అన్నారు. సీతంరాజును గెలిపించి ఆయనకు గిఫ్ట్ గా ఇద్దామని చెప్పారు.

భారీగా పెట్టుబడులు..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగ్గజ పారిశ్రామిక వేత్తలు విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు తరలివచ్చారని గుర్తు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్స్ గా భావిస్తోన్నామని చెప్పారు. వెనుకబడిన కులాలు, దళితులు, మైనారిటీ.. ఇలా అన్ని వర్గాల వారికి జగన్ న్యాయం చేస్తోన్నారని అన్నారు.












Click it and Unblock the Notifications