విశాఖలో వైసీపీని చికాకుపెడుతున్న ఆ ఒక్కడు- ఆకర్ష్కు బ్రేక్- అది జరిగితే వార్ వన్సైడ్
దశాబ్దాల నుంచి స్ధానికేతరులకు అవకాశాలు కల్పించడంలో ముందుండే విశాఖ నగరంలోనూ ఇప్పుడు స్ధానికులు, స్ధానికేతరుల మధ్య వార్ కొనసాగుతోంది. అయితే విచిత్రంగా ఇది పార్టీల మధ్య యుద్ధంగా మారిపోయింది. దీని వెనుక ఎన్నో కారణాలున్నప్పటికీ కార్యనిర్వాహక రాజధానిగా మారుతున్న విశాఖ నగరంలో పట్టు కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాలే అసలు కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ అప్రతిహతంగా సాగుతున్న వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్కు బ్రేక్ పడిందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. వైసీపీని విజయానికి అడుగు దూరంలో నిలిచేలా చేసిన ఈ వార్ వన్సైడ్ కావడం కష్టమేనా ?
టీడీపీ, వైసీపీ సవాళ్లతో వేడెక్కిన విశాఖ- ఎమ్మెల్యే వెలగపూడి ఇంటికి భారీ భద్రత
వైసీపీకి మింగుడుపడని విశాఖ
విశాఖపట్నంలో రాజకీయాలు ఓ పట్టాన ఎవరికీ అంతుపట్టవు. వైసీపీ విషయానికొస్తే మింగుడు పడవు కూడా. ఎందుకంటే స్ధానికుల కంటే స్ధానికేతరుల హవా కొనసాగే ఈ సాగర నగరంలో స్ధానికులను ఆకట్టుకునేందుకు ఓ బలమైన వ్యూహం రచించడంలో వైసీపీది వెనుకబాటే. ఈ విషయాన్ని ముందే గ్రహించిన టీడీపీ 2014 ఎన్నికల్లో జనం ఎమోషన్స్ను, 2019లో పోల్ మేనేజ్మెంట్ను నమ్ముకుని ఇక్కడ వరుస విజయాలు సాధించింది. ఈ విషయంలో టీడీపీని కౌంటర్ చేసేందుకు వైసీపీకి ఒక్క అవకాశం కూడా దొరకలేదు. దీంతో కేవలం రూరల్ నియోజకవర్గాలను నమ్ముకుని వైసీపీ రాజకీయాలు చేయాల్సి వస్తోంది.
రాజధానితో వేడెక్కిన విశాఖ రాజకీయం
ఏపీ విభజన తర్వాత రెండు ఎన్నికల్లోనూ విశాఖ నగరంపై తన పట్టు కొనసాగించిన టీడీపీకి వైసీపీ మూడు రాజధానుల వ్యూహం భారీ ఎదురుదెబ్బగా మారింది. ముఖ్యంగా రాజధాని తెస్తున్న వైసీపీని కాదని టీడీపిని సమర్ధించే పరిస్ధితుల్లో ఇక్కడి ప్రజలు లేరు. కానీ రాజధాని ప్రకటనకు ముందే గతేడాది ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా మారారు. దీంతో ఒక్కొక్కరిగా వారిని టార్గెట్ చేస్తూ వస్తోంది. ముందుగా సిటీ పరిధిలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై దృష్టిపెట్టిన వైసీపీ.. వారిని ఒక్కొక్కరిగా పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తోంది.
విశాఖలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్
కార్యనిర్వాహక రాజధానిగా మారుతున్న విశాఖలో రాజకీయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ గతేడాది నుంచే స్కెచ్లు వేయడం మొదలుపెట్టింది. ముందుగా విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి తులసీరావు కుటుంబాన్ని పార్టీలో చేర్చుకున్న వైసీపీ... ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణ, గణబాబుపై ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగించింది. వీరిలో గంటా ఇప్పటికే టీడీపీకి దూరంగా ఉంటుండగా.. వాసుపల్లి గణేశ్ వైసీపీకి మద్దతిచ్చేశారు. ఇక మిగిలింది వెలగపూడి రామకృష్ణ, గణబాబు. వీరిలో గణబాబు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా వైసీపీపై విమర్శలు చేయడం లేదు. వెలగపూడి మాత్రం వైసీపీకి పంటి కింద రాయిలా తయరయ్యారు.
వైసీపీ ఆకర్ష్కు వెలగపూడి బ్రేకులు
గతేడాది ఎన్నికల తర్వాత అడారి తులసీరావు, పంచకర్ల రమేష్ బాబు, వాసుపల్లి గణేశ్ వంటి కీలక నేతల్ని ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమవైపుకు తిప్పుకున్న వైసీపీకి మిగతా నేతలు కూడా దారికి రావడం పెద్ద కష్టమేమీ కాదన్న భావన కలిగింది. కానీ వెలగపూడి రామకృష్ణబాబు రూపంలో వైసీపీకి ఆ అవకాశం దూరమైంది. స్వతహాగా పారిశ్రామికవేత్త, అంగబలం, అర్ధబలం ఉన్న నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడైన వెలగపూడి రామకృష్ణ వైసీపీ ఆకర్ష్ యత్నాలకు బ్రేకులు వేశారు. దీంతో ఇప్పుడు ఆయన్ను రాజకీయంగా టార్గెట్ చేసేందుకు వైసీపీ అష్టకష్టాలు పడుతోంది. ఎప్పుడో ముగిసిపోయిన రంగా హత్యను తెరపైకి తెచ్చి వెలగపూడి పాత్రను గుర్తుచేస్తోంది. అయినా ఈ విమర్శలకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది.
ఆయనొస్తే ఇక వార్ వన్సైడ్
వచ్చే ఏడాది రాజధానిని విశాఖ నగరానికి ఎట్టి పరిస్ధితుల్లోనూ తరలించాలని భావిస్తున్న వైసీపీ సర్కారుకు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ విసురుతున్న సవాళ్లు ఇబ్బందికరంగా మారాయి. దీంతో ఆయన నోరు మూయించేందుకు సామ, దాన, భేద దండోపాయాల్ని ప్రయోగిస్తోంది. అయితే ఆయన అంత సులువుగా లొంగే రకం కాదు. అయితే పరిస్ధితి వికటించి వెలగపూడి వైసీపీకి జై కొట్టడం కానీ లేక కనీసం టీడీపీకి దూరంగా ఉండటం మొదలుపెడితే కచ్చితంగా సాగర నగరంలో వార్ వన్సైడేనని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే గంటా, వాసుపల్లి గణేశ్ను టీడీపీకి దూరం చేసిన వైసీపీ.. మరో ఎమ్మెల్యే గణబాబును దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాబోదని అంచనా వేస్తోంది. ఇక మిగిలిన వెలగపూడిని కూడా నయానో భయానో దారికి తెచ్చుకుంటే వార్ వన్ సైడ్ చేయొచ్చని లెక్కలు వేసుకుంటోంది.