డ్రామలాడుతున్నారా..వీఆర్ఏలపై కేసీఆర్ ఆగ్రహాం
పే స్కేల్ తదితర డిమాండ్లతో వీఆర్ఏలు ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. గత నెల 20వ తేదీన జరిగిన చర్చలు సక్సెస్ కాలేదు. దీంతో వీఆర్ఏల నిరసన కొనసాగుతోంది. ఇవాళ సీఎం కేసీఆర్ ఓరుగల్లు పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. మార్గ మధ్యలో రెండుసార్లు వీఆర్ఏ ప్రతినిధులు తారసపడ్డారు. ఒకసారి సావధానంగా విన్న కేసీఆర్.. మరోసారి మాత్రం ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని సీఎం కేసీఆర్కి వినతి పత్రం అందించారు. వీఆర్ఏల ఫిర్యాదును కోపంతో వారిపై కేసీఆర్ విసిరివేశారు. డ్రామాలాడుతున్నారా అని వీఆర్ఏ సంఘం నేతలపై సీఎం ఫైర్ అయ్యారు. మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి కేసీఆర్ వెళ్లిన క్రమంలో ఆయనను వీఆర్ఏ సంఘం నాయకులు కలిశారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో వీఆర్ఏ ప్రతినిధులంతా ఆశ్చర్యపోయారు.
అంతకుముందు జనగామ వద్ద సీఎం కేసీఆర్కు నిరసన సెగ తగిలింది. సీఎం కాన్వాయ్ ముందు వీఆర్ఏలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఏ ఆందోళనతో సీఎం కేసీఆర్ కారు దిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హన్మకొండలో మాత్రం వారిపై కేసీఆర్ ఫైరయ్యారు.
హన్మకొండ జిల్లాలో గల దామెర క్రాస్ రోడ్, నేషనల్ హైవే 163లో ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రతిమ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.