ముంచడమే తెలుసు.. అప్పటికప్పుడు హామీలు, సర్కార్పై విజయశాంతి ఫైర్
టీఆర్ఎస్ సర్కారుపై మరోసారి తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చెప్పే కల్లబొల్లి కబుర్లు జంటనగరాల ప్రజలకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. వర్షాలు పడితే కాల్వలను తలపించే హైదరాబాద్, సికింద్రాబాద్ వీధులు.. నాలాల బారినపడి జనం విలవిల లాడుతుంటారని వివరించారు. వర్షాలు తగ్గగానే సమస్య మళ్లీ తలెత్తకుండా చూస్తామని చెబుతూనే ఉన్నారు.. చూస్తూనే ఉన్నామని చెప్పారు.
ఇప్పుడు వరంగల్ నగరానికి కూడా ఇదే అనుభవాన్ని అందిస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. గత ఏడాది భారీ వర్షాలతో వరంగల్, పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయని గుర్తుచేశారు. ఆ సమయంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటన చేశారని గుర్తుచేశారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, చర్యలు తీసుకుని ముంపు ముప్పు తగ్గిస్తామని చెప్పారని.. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా పరిస్థితి ఉందని చెప్పారు.
Recommended Video
రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ మళ్లీ భీతిల్లిపోయే పరిస్థితి వచ్చిందని విజయశాంతి మండిపడ్డారు. ఆక్రమణల కూల్చివేతలు అరకొరగా సాగుతున్నాయని వివరించారు. నాలాలపై ఆక్రమణల తొలగింపు ఊసేలేని విమర్శించారు. రోడ్ల కంటే డ్రైనేజీలు ఎత్తుగా కడుతూ చారిత్రక వరంగల్ నగరాన్ని మరింత మురికికూపంగా మార్చేశారని మండిపడ్డారు. ఏ పని చేసినా జనాన్ని ముంచడమే తప్ప మంచి చేయడం తెలియని కేసీఆర్ సర్కార్కి తెలియదు అన్నారు. అందుకే ప్రభుత్వానికి ముంపు ముప్పు దగ్గరలోనే ఉందని విజయశాంతి హెచ్చరించారు.