కౌన్ బనేగా రామాయణ్ ఎక్ప్పర్ట్
అమెరికాలోని భారతీయుల పిల్లలు అటు అమెరికా సంస్కృతికి ఇటు భారతీయ సంస్కృతికి కాకుండా పోతారనే అభిప్రాయం ఉంది. అంటే వీరు రెంటికి చెడ్డ రేవడి అవుతారనేది ఆ అభిప్రాయంలోని సారాంశం. ఇటీవలి కాలంలో అమెరికాలోని 100 సెంటర్లలో జరిగిన పరీక్షలో అమెరికాలోని భారతీయ విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. రామాయణంపై వారికి గల ప్రతిభవిశేషాలను ప్రదర్శించి అబ్బురపరిచారు. అమెరికాలోని భారతీయ పిల్లలకు భారతీయ సంస్కృతిని, హిందూ విలువలను అందించే ప్రాజెక్టులో భాగంగా బాలగోకులం అమెరికాలోని భారతీయ పిల్లలకు ఒక విశిష్టమైన పోటీని నిర్వహించింది. ఇలాంటి పోటీ జరగడం ఇదే ప్రథమం. మొత్తం 3 వేల మంది పిల్లలు తమ పేర్లను నమోదు చేసుకోగా 2000 మంది పిల్లలు ఇన్ - పర్సన్ ఎగ్జామినేషన్లో పాల్గొనడానికి అర్హత పొందారు.
ఆ పోటీలో మాడిసన్కు చెందిన బాలగోకులం పిల్లలు కూడా పాల్గొన్నారు. లెక్కలు చేయడంలో విశేష ప్రతిభ చూపి తన లెక్కల టీచర్లను ఆశ్చర్యపరిచిన అర్జున్ శేషాద్రి రామాయణం పోటీలో కూడా పాల్గొన్నాడు. అతనికి హనుమంతుడంటే ఒక అద్బుతం. రామాయణం గురించి తెలుసుకోవడానికి అతను ఎంతో ఆసక్తి కనబరిచాడు. ఇతర కార్యకలాపాలు ఎన్ని ఉన్నప్పటికీ నిషాంత్ చిలుక, శ్రీరామ్ బచ్చు, పరీక్షిత్ లింగంపల్లి వంటి పిల్లలు కూడా రామాయణంపై జరిగిన పోటీలో పాల్గొనడానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. రామాయణం నేర్పడానికి తన పిల్లవాడితో కొంత సేపు గడిపే అవకాశం లభించినందుకు రమా లింగంపల్లి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తనకు తమ తల్లిదండ్రులు రాముడి గురించి, సీత గురించి కథలు ఎలా వినిపించారో నెమరేసుకునే అపూర్వ అవకాశం తనకు లభించిందని ఆమె భావించారు.
దేశికన్ రామాయణంపై పోటీ నిర్వహించాలనే భావననే ఒక గొప్ప విషయమని అన్నారు. తమిళ నూతన సంవత్సర సంబరాల్లో మునిగితెలుతూనే తన కూతురు హరిణి రామాయణం నేర్చుకోవడానికి చూపిన ఆసక్తికి ఆమె మురిసిపోయారు. ఆమె స్నేహితురాలు ఉషా శంకరన్ కూడా అదే అనుభూతిని వ్యక్తం చేశారు. తన కుమారుడు విశాల్కు రామాయణం గురించి చాలా తెలుసునని, అమర్ చిత్ర కథలు చాలా ఆసక్తితో చదువుతాడని ఆమె చెప్పారు. తన కొడుకును పోటీలకు తీసుకెళ్లడానికి వంద మైళ్లు ప్రయాణం చేయడాన్ని కూడా కాజారావు దంపతులు కష్టంగా భావించలేదు. తమ కూతురు అమృతను 90 మైళ్ల దూరం పోటీల్లో పొల్గొనడానికి గెడ్డం దంపతులు తీసికెళ్లారు.
ఇన్ - పర్సన్ ఎగ్జామినేషన్లో పాల్గొనడానికి ముందు ఆన్లైన్ రామాయణ్ పోటీలో అభిలాష్ సందిరెడ్డి అత్యంత ఎక్కువ మార్కులు సాధించాడు. దేవి తమ్మినేనితో పాటు మరికొంత మంది తల్లిదండ్రులు మాడిసన్లో పిల్లలకు తెలుగు తరగతులు తీసుకుంటారు. తమ పిల్లలు విద్యలో విశేషమైన ప్రతిభను ప్రదర్శించడంతో పాటు వారు తమ సాంస్కృతిక మూలాలు తెలుసుకోవాలని అనుకుంటానని ఆమె అన్నారు. తమ ఐదేళ్ల కుమారుడు అనురాగ్ పేరును నమోదు చేయించామని ఆమె చెప్పారు. ఆమె ఇద్దరు పిల్లలు కూడా రామాయణం గురించి ఈ పోటీ వల్ల చాలా తీసుకున్నారని ఆమె చెప్పారు.
అనురాగ్తో పాటు మరో ఐదేళ్ల వైష్ణవి కూడా ఈ పోటీల్లో పాల్గొన్నది. తాను బాలరామాయణాన్ని 20 సార్లకు పైగా చూశానని, తనకు ఆంజనేయుడంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పింది. తన కూతురు వైష్ణవి ఆన్లైన్ పరీక్షలో పాసై ఇన్ - పర్సన్ ఎగ్జామినేషన్కు అర్హత సాధించినందుకు గీతా మాధవ్ ఆనందం వ్యక్తం చేశారు. నీరజ కొమరగిరి, వెంకట్ బచ్చు మాడిసన్లోని ఈవెంట్ను సమన్వయం చేశారు. ఎంతో మంది పిల్లలు తమ సంస్కృతి పట్ల ఆసక్తి ప్రదర్శించడం తనకెంతో ఆనందం కలిగించిందని నీరజా కొమరగిరి అన్నారు. వచ్చే నాళ్లలో మహాభారతంపై కూడా ఇటువంటి పోటీ జరగాలని ఆశిస్తున్నట్లు వెంకట్ బచ్చు అన్నారు.