లాస్ ఏంజెల్స్లో ఉస్మానియా అలుమ్ని మీట్
ఆటా సమావేశాల సందర్భంగా ఈ నెల 2వ తేదీన దాదాపు 100 మంది ఉస్మానియా మాజీ విద్యార్థులు లాస్ ఏంజిల్స్లో సమావేశమయ్యారు. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆలుమ్నికి విచ్చేసినవారికి రవి మేరెడ్డి స్వాగతం చెప్పారు. అల్యుమినీ కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. 1967లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షుడిగా పని చేసిన సీనియర్ మాజీ విద్యార్థి హరినాథ్ మేడి సమావేశానికి అధ్యక్షత వహించారు.
అమెరికాలో ఉన్న విశ్వవిద్యాలయ మాజీ విద్యార్థుల సమావేశ కార్యకలాపాలను సమన్వయం చేయాలని హరినాథ్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సులేమాన్ సిద్దిఖిని, స్పెషల్ ఆఫీసర్ ప్రొఫెసర్ వేణుగోపాల రెడ్డిని ఆహ్వానించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతి కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్లో ఏర్పాటు చేస్తున్నట్లు, వీటి ద్వారా విద్యార్థులకు ఆంగ్లభాషలో నైపుణ్యాన్ని, కమ్యూనికేషన్ స్కిల్ను పెంచుతామని సులేమాన్ సిద్దిఖి చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి కొత్తగా తీసుకోవాల్సిన చర్యల గురించి సలహాలు ఇవ్వాలని ఆయన ఎన్నారై ఉస్మానియా మాజీ విద్యార్థులను కోరారు. విశ్వవిద్యాలయానికి తమ సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
డబ్బులు పెట్టి చదువుకోలేని పేద విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక్కటే ఆశ అని మేరెడ్డి రవి అన్నారు. తమకు ఉస్మానియాతో గల అనుబంధాన్ని ఆయన వివరించారు. తమ సహాయంతో ఉస్మానియా చేపట్టగలిగే కార్యక్రమాల గురించి ఆయన చెప్పారు. సామాజిక చైతన్యాన్ని పెంచడానికి, బాధ్యతాయుత పౌరులుగా రూపొందడానికి ప్రేరణనందించే ఇష్టాగోష్ఠులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రతిభ గల పేద విద్యార్థులకు సహాయం చేయడానికి అలుమ్ని ఎడ్యుకేషనల్ ఫండును ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. విజిట్ క్యాంపస్ కార్యక్రమాన్ని కూడా విశ్వవిద్యాలయం చేపడితే బాగుంటుందని, మాజీ విద్యార్థులను ఆహ్వానించి విద్యార్థులను ఉత్తేజపరిచే అనుభావాలను వాటి ద్వారా చెప్పించాలని ఆయన అన్నారు.
అలుమ్ని కార్యకలాపాల కోసం డాక్టర్ పైల్ల మల్లారెడ్డి, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. కె. మధుసూదన్ రెడ్డి, శరత్ వేముల, వెంకట్ మారోజు, భూపతి సుప్పల, కరుణాకర్, సుధాకర్ విడియాల వేయి డాలర్లేసి విరాళాన్ని ప్రకటించారు. శాస్త్రవేత్త డాక్టర్ బాల్రెడ్డి స్కాలర్షిప్/ ఫెలోషిప్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఉస్మానియా మాజీ విద్యార్థులు హనుమంతరెడ్డి, ధర్మారెడ్డి, డాక్టర్ గుండారెడ్డి, సుధాకర్, ఇంద్రసేన్, బుచ్చన్న, పార్థసారథి రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.