పిల్లల కోసం పాలమూరు ఎన్నారైలు
మహబూబ్నగర్కు చెందిన ప్రవాస భారతీయులు తమ మాతృభూమి రుణం కొంత తీర్చుకునేందుకు సిద్ధపడ్డారు. పాలమూరు జిల్లాలోని గ్రామీణ పిల్లల చదువు కోసం వచ్చే ఐదేళ్ల పాటు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. అందుకు వారు 30 వేల డాలర్లను అందిస్తున్నారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కులను వారు ఇటీవల అందజేశారు. ఇది మొదటి దశ మాత్రమే. బాల కార్మికులను, మధ్యలో బడి మానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం (డిపెప్) కింద నడిచే బ్రిడ్జి స్కూళ్లలోని పిల్లలకు ఈ ఆర్థిక సహాయం అందుతుంది.
విద్య, ఆరోగ్యం, అభివృద్ధి రంగాల్లో సేవలందిస్తున్న స్థానిక సేవా సంస్థ సేవాభారతి ద్వారా ఎన్నారైలు పిల్లలకు ఈ సహాయం అందిస్తున్నారు. టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ నిర్వహించి సేవా భారతి 154 బ్రిడ్జి స్కూళ్ల నుంచి 200 మందికి పైగా పిల్లలను ఎంపిక చేసుకుంది. పాలమూరు ఎన్నారై ఫోరమ్ ద్వారా ప్రవాస భారతీయులు వ్యక్తిగతంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. పాలమూరు ఎన్నారై ఫోరమ్ 30 మంది పిల్లలకు ప్రస్తుతం సహాయం అందిస్తోంది. ఇందుకు మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉందని కూడా ఫోరమ్ భావిస్తోంది. పిల్లల విద్యకు, హాస్టల్ సౌకర్యానికి, ఆహారానికి, పుస్తకాలకు, బట్టలకు ఏడాదికి 200 డాలర్ల విరాళం అవసరమని అంచనా.