చికాగోలో బాపు బొమ్మల కొలువు
చికాగోలో ఉన్న బాపు అభిమానులకు కన్నల పండుగగా అక్టోబర్ 11వ తేదీ బుధవారం సాయంత్రం అరోరార శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బాపు చిత్రకళా ప్రదర్శన జరిగింది. ప్రముఖ చిత్రకారుడు శ్రీ బాపు చిత్రించిన 200 చిత్రాలను అభిమానులు చూసి ఆనందించారు. పనివారం మధ్యలో, వాతావరణం అనుకూలంగా లేకపోయినా పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ సమావేశానికి హాజరై శ్రీ బాపు పట్ల తమ అభిమానాన్ని చాటి చెప్పారు.
చిత్రప్రదర్శనకు ముందు శ్రీ బాపును వెంకటేశ్వరస్వామి దేవాలయం ట్రస్టీ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ అక్కినేని సుదర్శనరావు, పూజారులు ఆలయ మర్యాదలలో ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాబపు చిత్రాలను తెరపై దృశ్యమాలికగా ప్రదర్శించారు.
చిత్ర ప్రదర్శన అనంతరం తెలుగునాడి పత్రిక సంపాదకులు డాక్టర్ జంపాల చౌదరి అధ్యక్షతలో బాపుతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఒక గంటసేపు అభిమానులు శ్రీ బాపును వివిధ ప్రశ్నలు అడిగారు. వాటికి శ్రీ బాపు తన సహజరీతిలో ఛలోక్తులతో సమాధానాలు చెప్పి అలరించారు. తెలుగునాడి, అమెరికా తెలుగు పత్రిక కార్యనిర్వాహక వర్గం ప్రత్యేక జ్ఞాపికతో శ్రీ బాపును సత్కరించారు.
ఈ సమావేశాన్ని తెలుగునాడి పత్రిక, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, ట్రైస్టేట్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆప్ గ్రేటర్ చికాగో సంయుక్తంగా నిర్వహించాయి.