తెలంగాణ ఏర్పాటే పరిష్కారం: టిడియఫ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వేటినీ వదిలిపెట్టబోమని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టిడియఫ్) బే ఏరియా వ్యవస్థపాక ట్రస్టీ గాదె గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గాజుల బుచ్చన్న, వేణు పావుషెట్టి, మురళీ దుగ్యాల నేతృత్వంలోని టిడియఫ్ బే ఏరియా చాప్టర్ ఈ నెల 8వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 80 మందికి పైగా పాల్గొన్న ఈ సమావేశంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ రిటైర్డ్ ఇంజనీరు ఆర్. విద్యాసాగరరావు, ప్రొఫెసర్ హరినాథ్ పొలాస ముఖ్యవక్తలుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ మేధావులు చేస్తున్న కృషికి టిడియఫ్ బే ఏరియా చాప్టర్ పూర్తి మద్దతు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధి పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న తీరును విద్యాసాగర్ రావు వివరించారు. స్థానిక రాజకీయ నాయకుల నిష్క్రియాపరత్వం గురించి కూడా ఆయన వివరించారు. గణాంకాలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించిన తీరు శ్రోతలను ఆకట్టుకుంది. హైదరాబాద్ అభివృద్ధిని తెలంగాణ అభివృద్ధి నుంచి వేరు చూడాల్సిన అవసరం ఉందని ఆయన ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నేడో రేపో ఏర్పడడం ఖాయమని, అయితే రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఎన్నారైలు సహకరించాలని ఆయన అన్నారు.
తెలంగాణ వెనకబాటుతనం వల్ల ఈ ప్రాంత ప్రజలు జీవనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎలా వలసపోతున్నదీ ప్రొఫెసర్ హరినాథ్ పొలాస వివరించారు. అలా వలస వెళ్లనివారు నక్సలిజం పట్ల ఆకర్షితులవుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మినహా మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు బలంగా నమ్ముతున్నారని ఎపి ఎస్సి, ఎస్టి, బిసి ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ సురేందర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము పూర్తిగా సహకరిస్తామని, అలాగే ఈ ప్రాంత అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నెరవేరుస్తామని పాలమూరు ఎన్నారై ఫోరం కో ఆర్డినేటర్ విజయ్ చవ్వా చెప్పారు. అర్షద్ హుస్సేన్, పవన్ ముప్పిడి, రాజేశ్, సురేష్, వినోద్, జయపాల్ సాముల, యుగంధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రమేష్, నాగేశ్వరరావు వంటి పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ధూమ్ధామ్ డివిడి ప్రదర్శన ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది.