తెలంగాణపై వరస సమావేశాలు
గత మూడు వారాల పాటు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టిడియఫ్) అమెరికాలోని వివిధ నగరాల్లో 15 రోజుల పాటు వరుస సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ సమావేశాలు ఆటా సభల సందర్భంగా లాస్ ఏంజెల్స్లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్ విద్యాసాగరరావు, ప్రొఫెసర్ హరినాథ్ అవిశ్రాంతంగా ప్రసంగిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో, తెలంగాణ సమస్యల విషయంలో అమెరికాలోని తెలంగాణవారు లేవనెత్తిన పలు అంశాలకు వారు సమాధానాలిస్తూ పోయారు. వారు అమెరికాలో పది వేల మైళ్ల పాటు తిరిగి సియాటిల్, హూస్టన్, డల్లాస్, చికాగో, బోస్టన్ వంటి పలు నగరాల్లో తెలంగాణ ఎన్నారైలను కలుసుకున్నారు.
చికాగో సమావేశం నుంచి వరంగల్ మాజీ మేయర్, బిజెపి నాయకుడు రాజేశ్వరరావు ఈ వక్తల బృందంలో చేరారు. తెలంగాణ పట్ల బిజెపి వైఖరిని ఆయన వివరిస్తూ వెళ్లారు. బిజెపి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సుముఖంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి బిజెపి మద్దతు సంపూర్ణంగా వుంటుందని ఆయన చెప్పారు. బోస్టన్లో ఈ నెల 4వ తేదీన, న్యూయార్క్లో 5వ తేదీన సమావేశాలు జరిగాయి.