బ్రిటన్ లో భారత విద్యార్ధుల 'ఆకలి రాజ్యం'
స్వదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉండటంతో భారతీయ విద్యార్థులు యూకే నుంచి తిరిగి వచ్చేందుకు కూడా ఆసక్తి చూపటంలేదని బీబీసీ డాక్యుమెంటరీ పేర్కొంది. కాగా..ఈ సంవత్సరం ఏఫ్రిల్ నెలలో పాయింట్లవారీ వలస విధానం ప్రవేశపెట్టాక యూకేకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య మూడింతలు పెరిగింది.
స్వల్పకాలిక ఉద్యోగం సంపాదించి కళాశాలల్లో విద్యాభ్యాసం కొనసాగించవచ్చని చాలామంది అక్కడికి తరలివెళ్ళారు. అయితే ఉద్యోగం దొరకని నేటి పరిస్థితుల్లో తీవ్ర నిరాశకు గురైన వారు తిండి కూడా లేకుండా ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారని బీబీసీ తెలిపింది. ఇలాంటి స్థితిలో స్థానిక గురుద్వారాల ద్వారా ఆశ్రయం పొందుతూ బ్రతుకుబండిని కనాకష్టంగా సాగదీస్తున్నారు.
అలా గురుద్వారాలో ఆశ్రయం పొందుతున్న ఓ విద్యార్థి మాట్లాడుతూ...అద్దె భరించలేననీ, కాలేజీకి వెళ్లేందుకు, బస్ ఛార్జీల కోసం ఇంటిదగ్గరనుంచి, బంధువుల నుంచి డబ్బు తెప్పించుకుని వాడుకుంటున్నానని వాపోయాడు. ఉద్యోగం దొరికితేనే ఏదేని గది అద్దెకు తీసుకోవటం వీలవుతుందనీ, తిరిగీ ఇంటికి వెళ్లిపోతానని అన్నాడు. కానీ అలా వెళ్ళినా బంధువులు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేక అవమానపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
భారత్లోని ఏజెంట్లు యూకేలో తప్పకుండా పార్ట్టైం జాబ్స్ దొరుకుతాయని నమ్మబలికి ఇక్కడికి పంపించేస్తున్నారనీ, అయితే ఇక్కడ వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని ఇంకో విద్యార్థి ఆరోపించాడు. ఇదిలా ఉంటే..ఆర్థికమాంద్యం, యూకే వచ్చే భారత విద్యార్థుల సంఖ్య పెరగటంతోనే అక్కడి పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.