డల్లాస్లో బాలయ్యకు ఆదరణ
బసవతారకం కాన్సర్ ఆసుపత్రికి నిధుల సేకరణ కోసం తెలుగు సినీ హీరో నందమూరి బాలకృష్ణ డాల్లస్ వచ్చిన సందర్భంగా స్థానిక ఆంధ్రులు, నందమూరి అభిమానులు ఈ నెల మూడవ తారీఖున ప్లేనోలోని మేరియట్ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అక్కడి తెలుగువారు విశేషంగా పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్య అతిథి బాలయ్యను మండువ సతీష్, ఉప్పు వినోద్, కొండ్రకుంట చలపతి రావు, పోలవరపు శ్రీకాంత్ సభలోనికి తోడ్కొనిరాగా సభలోనివారందరికీ మండువ సురేష్ స్వాగతం పలికారు.

బాలయ్య సభలో అందరి వద్దకు వెళ్ళి పేరుపేరునా తనదైన శైలిలో పలుకరించి కుశలప్రశ్నలు వేసి వచ్చిన వారందరికీ చక్కని అనుభూతి కలిగించారు. ఈ సమయంలో స్థానిక సాంస్కృతిక సంస్థ కళావాహిని ఆధ్వర్యంలో జరిగిన సంగీతకార్యక్రమంలో ప్రముఖగాయకుడు మహారాజపురం రాము, ఇతర స్థానిక గాయనీగాయకులు పాడిన బాలయ్య, స్వర్గీయ ఎన్టీయార్ సినిమాలలోని పాటలు అందరినీ అలరించాయి.
తరువాత జ్యోతిప్రజ్వలన అనంతరం అడుసుమిల్లి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఉపన్యాస కార్యక్రమంలో కాన్సర్ వైద్యురాలు మద్దుకూరి నీలిమ మాట్లాడుతూ- కాన్సర్ గురించి, ఆ వ్యాధినివారణ కోసం చెపట్టవలసిన చర్యలగురించి చెప్పి, బసవతారకం సంస్థ చేస్తున్న సేవలను, సభలోని వారి వితరణను అభినందించారు. తరువాత మరో వైద్యురాలు వేములపల్లి రూప కోలన్ కాన్సర్ గురించి మాట్లాడారు. వైద్య విద్యార్థి కోసూరి సుష్మి సుశాన్ జీ కొమెన్ ఫౌండేషన్ చేస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సపోర్ట్ చెయ్యటానికి గల ప్రముఖ్యాన్నిగురించి మాట్లాడిన తరువాత వైద్యులు, స్థానిక పెద్దలు రాఘవేంద్ర ప్రసాద్, నవనీత కృష్ణ, ఇటువంటి మంచి పనులకు చేయూత నివ్వవలసిన అవసరం గురించి చెప్పారు.
తరువాత సర్వోదయ మండలి రాష్ట్ర కార్యదర్శి గొల్లనపల్లి ప్రసాద్ మాట్లాడి బాలయ్యకు ఒక పుస్తకాన్ని, శాలువను బహూకరించారు. ముఖ్యఅతిథి నందమూరి బాలకృష్ణను అడుసుమిల్లి రాజేష్ వేదికమీదకు ఆహ్వానించగా కొండ్రకుంట చలపతి రావు, జాస్తి సాంబశివరావు, మండువ సతీష్ శాలువలతో, రావెళ్ళ శ్రీనివాస్, ఉప్పువినోద్, కోరాడ కృష్ణ పుష్పగుచ్చాలతో ఆయనను సత్కరించారు.
అనంతరం బాలయ్య మాట్లాడుతూ ప్రవాసాంధ్రుల విజయాలను, వితరణను కొనియాడారు. తనతల్లి స్వర్గీయ ఎన్టీయార్ సతీమణి శ్రీమతి బసవతారకం కాన్సర్ వ్యాధితో పడిన బాధ, సరైన వైద్య సౌకర్యంలేక ఆవిడ చనిపోవడం, తరువాత ఎన్టీయార్ అనేకమంది వైద్యుల, దాతల తోడ్పాటుతో ఈ ఆసుపత్రిని ప్రారంభించడం తరువాత భారతదేశంలోనే అగ్రగామి కాన్సర్ ఆసుపత్రిగా పరిశోధనా సంస్థగా ఆ సంస్థ సాధించిన ఘనత మొదలైన విషయాలు ప్రస్తావించారు.
దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారికి చౌకలో ప్రపంచస్థాయి వైద్యం అందించడం ఈ సంస్థ ఆశయంగా చెప్పారు. అయితే ఖరీదైన వైద్యాన్నితక్కువ అందించడానికి, పరిశోధనకు ఎంతో ధనం అవసరమని అందువల్లే తాను నిధుల సేకరణ చేస్తున్నానని వివరించారు. ఇలా ప్రతి ఏడూ చేస్తూనే ఉంటానని, త్వరలో విజయవాడ, విశాఖపట్నం, మొదలైన ప్రాంతాలలో అసుపత్రులు నెలకొల్పబోతున్నామని, డాల్లస్ లోని తెలుగువారు ఇలా తమ చేయూతనందిస్తూ ఈ సంస్థ కార్యకలాపాలలో భాగస్వాములు అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అభిమానుల కోరికమీద తన సినిమాలలోని శక్తివంతమైన డైలాగులు చెప్పినప్పుడు అభిమానుల ఈలలతో, చప్పట్ట్లతో సభాస్థలం మార్మోగి పోయింది.
పిమ్మట భూరివిరళాలందించిన దాతలకు జ్ఞాపికలను బాలయ్య అందించారు. అనంతరం ప్రముఖ కూచిపూడి కళాకారిణి షేక్ నదియా దేవి అవతారాలతో కూడిన అద్భుతమైన నృత్య ప్రదర్శన చేశారు. విరాళాల మొత్తం $84,500 చెక్కును నిర్వాహకులందరూ బాలయ్యకు అందించడంతో వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మానవ సేవే మాధవసేవ అంటూ ఇంత గొప్ప కార్యానికి తోడ్పాటు అందించిన దాతలకు, ఉత్సాహం తో తరలి వచ్చిన బాలయ్య అభిమానులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలుపడంతో సభ ముగిసింది.












Click it and Unblock the Notifications