డల్లాస్ లో వైభవంగా ఉగాది ఉత్సవాలు

మహా గణపతిం కూచిపూడి నృత్యం, భో శంభో భరత నాట్యం, రాళ్లబండి సుబ్రహ్మణ్యం పంచాంగ శ్రవణాలతో కార్యక్రమ శుభారంభం జరిగింది. డల్లాస్ లిటిల్ మ్యుజిసియన్స్ అకాడెమి బాలబాలికలు ఆలాపించిన సినిమా పాటల సందడి అందరిని అబ్బురపరిచింది. జగదానంద కారక, పూసింది పూసింది పున్నాగ, తరలిరాద తనే వసంతం, చందమామ రావే వంటి ఆణిముత్యాలలాంటి పాటలను పాడి అమెరికాలో పెరుగుతున్న పిల్లలు అచ్చమైన తెలుగు పిల్లలనిపించారు. తదుపరి గీత దమ్మన నందన నామ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ అధ్యక్ష సందేశంలో సంస్థ అభివృద్దికి తోడ్పాటు నందిస్తున్న పోషక దాతలకు, కార్యవర్గానికి, సభ్యులకు కృతఙ్ఞతలు తెలియచేశారు. తదుపరి టాంటెక్స్ రేడియో కార్యక్రమం “గాన సుధ” రేడియో వ్యాఖ్యాతలను వేదికపైకి ఆహ్వానించి అభినందించారు.
భారత దేశంనుండి ప్రముఖ నేపథ్య గాయకులు పార్థసారధి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆయన సంగీత విభావరిలో భాగంగా ఆలపించిన ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఓం నమో శివ రుద్రాయ, ఆడవే మయూరి పాటలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. స్థానిక గాయకురాలు జ్యోతి సాధు, పార్థు తో కలిసి హుషారు గొలిపే యుగళ గీతాల్ని ఆలపించారు. పార్థసారథిని కార్యవర్గ సభ్యురాలు జ్యోతి వనం పుష్ప గుచ్చంతో , ఉత్తరాధ్యక్షులు సురేష్ మండువ, ఉపాధ్యక్షులు విజయ్ కాకర్ల శాలువాతో, అధ్యక్షురాలు గీత దమ్మన, పాలక వర్గ అధ్యక్షులు ఆల్ల శ్రీనివాస రెడ్డి జ్ఞాపికతో సత్కరించారు.
ఉగాది ఉత్సవాల సందర్భంగా శీలం కృష్ణవేణి, ఇందు మందాడి గారు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి ఉగాది పచ్చడి పోటీలు, సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులనందించారు. మనబడి పిల్లలు ప్రదర్శించిన "అక్షరమాల" నృత్య రూపకం తెలుగు భాష తీయదనానికి దర్పణం పట్టింది. సరిత రెడ్డి నిర్వహించిన పిల్లల జాన్కారి బీట్స్, జ్యోతి వనం నిర్వహించిన ఉగాది నవరసాల సినిమా పాటల నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. చివరగా స్ఫూర్తి టీం చేసిన సినిమా నృత్యాలతో కార్యక్రమం హుషారుగా ముగిసింది. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక బృంద సభ్యులు మహేష్ ఆదిభట్ల, సాహితి సోలాస, పద్మశ్రీ తోట, ప్రవీణ్ బిల్లా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications