న్యూయార్క్‌లో ఉగాది సంబరాలు

TLCA celebrated 2012 Nandana Nama Samvatsara Ugadi
న్యూయార్క్ లోని గణేష్ హిందూ టెంపుల్ ఆడిటోరియంలో మార్చి 31వ తేదీన నందన నామ సంవత్సర ఉగాది వేడుకలని టిఎల్‌సిఎ ఘనంగా జరుపుకుంది. ఇండియా నుంచి విచ్చేసిన తారలతో, త్రినగరాలు, న్యూయార్క్, న్యూ జెర్సీ, కనెక్టికట్ మహా నగరాలనుంచి తరలి వచ్చిన వేయి మంది కి పైగా వీక్షకులు, కళాకారులతో , సర్వాంగ సుందరంగా అలంకరిచిన ఆడిటోరియం కళ కళ లాడింది. నూతనంగా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన వేలూరు నాగేంద్ర గుప్త నాయకత్వంలో కార్య నిర్వాహక సభ్యులు రెండు నెలలుగా ఎంతో శ్రమించి రూపొందించిన ఉగాది ప్రత్యేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరి హృదయాలను చూరగొన్నాయి.

ఉగాది పండగ అంతా ఇక్కడే ఉన్నదా అన్నట్టుగా తోరణాలు, బ్యానర్లు, పూదండలతో శోభాయమానంగా అలంకరించిన స్వాగత వేదిక విచ్చేస్తున్న టిఎల్‌సిఎ సభ్యులని సాదరంగా ఆహ్వానించింది. సభ్యుల పరస్పర పలకరింపులతో, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలతో, పిల్లల అల్లరి చేష్టలతో, నిర్దేశించిన సమయానికన్నా ముందే హాలు నిండిపోయింది. ప్రార్ధనా గీతంతో కార్యక్రమానికి శుభారంభం అందించారు. పంచరత్నాలు ప్రేక్షకులని భక్తీ పారవశ్యంలో ముంచెత్తాయి. రాగయుక్తంగా సాగిన ఆ సంకీర్తనలు మన త్యాగరాయ ఆరాధనోత్సవాలని తలపించాయి.

టిఎల్‌సిఎ చరిత్రలోనే మొదటి సారిగా నిర్వహించిన గాట్ టాలెంట్ షో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్రి నగరాలలో నివసించే తెలుగు యువత లోని ప్రతిభని వెలికి తెయడానికి సంస్థ చేసిన మరో వినూత్న ప్రయోగం ఈ కార్యక్రమం. అధ్యక్షులు నరేంద్ర గుప్త ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ పోటీకి నృత్యం, గానం, వాయిద్యం, ఏక పాత్రాభినయం, ఇత్యాది సెగ్మెంట్లలో విశేషంగా ఎంట్రీలు వచ్చాయి. వయోభేదం లేకుండా ప్రతిభే పట్టంగా ఆద్యంతం ఆసక్తిగా సాగిన పోటీలో విజేతలని నిర్ణయించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని న్యాయ నిర్ణేతలు గుండు హనుమంత రావు, మహేష్ సల్లాది పేర్కొన్నారు. కఠిన వడపోతకి గురై ఈ పోటీకి క్వాలిఫై అవడమే ఒక విజయంగా వర్ణిస్తూ పాల్గొన్న కళాకారులని అభినందించారు. ప్రథమ విజేత గా పూజా నట్టు ద్వితీయ విజేత గా సిద్ధూ ఎలిసెట్టి నిలిచారు.

ఇక తరవాయి భాగంలో తెలుగు సినిమా 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహోన్నత ఘట్టానికి టిఎల్‌సిఎ నీరాజనం పట్టింది. సెక్రటరీ కృష్ణ శ్రీ గంధం, కల్పన వనం నృత్య దర్శకత్వంలో రూపొందిన సినీ గీతాలనృత్య కార్యక్రమం అద్భుతంగా సాగింది. దాదాపు 30 మంది టిఎల్‌సిఎ సభ్యులు మహోత్సాహంగా పాల్గొని 1931 నుండి నేటి వరకు వచ్చిన తెలుగు సినిమాలలోని అజరామరమైన గీతాలకి నృత్యం చేసారు. నృత్య కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆడిటోరియం మారుమోగింది.

ఉగాది సంబరాలతో బాటు సభ్యులకి చక్కటి పండగ విందు భోజనాన్ని కూడా అందించింది టిఎల్‌సిఎ. సంప్రదాయ ఉగాది పచ్చడి, బొబ్బట్లు, పూట రేకులు, షడ్రుచులతో కూడిన అచ్చతెలుగు వంటకాల్ని చవిచూసిన తెలుగు సభ్యులు తాము స్వదేశానికి వేల మైళ్ళ దూరంలో ఉన్నామన్న విషయం మరచేలా చేసింది, పండగ ఈనడేనా అనిపిమ్పజేసిందీ విందు అని కొనియాడారు.

భోజనానంతరం, వేద పండితులు మన తెలుగు పంచాంగాన్ని వినిపించారు. అనంతరం, వేలూరు నాగేంద్ర గుప్త సంఘం అధ్యక్షులుగా తన ఈ సంవత్సర కార్యక్రమాన్ని వివరించారు. మన సంస్కృతీ, సంస్కారాల ఉద్దీపనకి, మన కమ్యునిటీ సంక్షేమానికి టిఎల్‌సిఎ చేస్తున్న కృషిని వివరిస్తూ ఈ సంవత్సరం తాము రెండు మెడికల్ కాంపులు నిర్వహిస్తామని తెలిపారు.

యువతకి పెద్ద పీట వేస్తూ వారిలో తెలుగు భాష మాట్లాడడం, చదవటం, వ్రాయడం పై ప్రత్యెక శ్రద్ధ వహిస్తూ, EFFECTIVE SPEAKING IN TELUGU FOR YOUTH అనే అంశం పై వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు.యువతలో భాషా సంస్కృతుల పట్ల మరింత అవగాహన పెంపొందించేందుకు టిఎల్‌సిఎ మరిన్ని కార్యక్రమాలని నిర్వహించాబోతున్నట్టు చెప్పారు. అలాగే, పిక్నిక్, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరియు మన కళలలో వివిధ పోటీలు నిర్వహించేందుకు కాలెండర్ సిధం చేస్తున్నట్టు చెప్పారు. క్రీడలని ప్రోత్సహించేందుకు టెన్నిస్ , క్రికెట్ లేకాకుండా మిగతా క్రీడలలో ప్రత్యెక పోటీలు నిర్వహించబోతున్నట్టు చెప్పారు. ఇందుకు తాము చేస్తున్న కృషిలో సర్వదా తోడున్న కార్యవర్గం చేస్తున్న నిరంతర కృషిని కొనియాడారు. అలాగే బోర్డు అఫ్ ట్రస్టీల సహకారాన్ని ప్రశంసించారు.

మరింత ముఖ్యంగా, ఎప్పుడూ ఆర్ధిక, హార్దిక సహాయ సహకారాలనందిస్తూ సంస్థకి వెన్నెముకగా నిలిచి టిఎల్‌సిఎ, మన కమ్యూనిటీ అభివ్రుది కి తోడ్పడే దాతల ప్రోత్సాహానికి మనః పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి తోడ్పాటు లేనిదే ఈ అభివ్రిది సాధ్యమయ్యేది కాదన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య దాతలైన శ్రీ మల్లారెడ్డి పైలాకు ప్రత్యెక కృతజ్ఞతలు తెలిపారు.

తరవాత తన నూతన కార్యవర్గాన్ని, నూతన బోర్డ్ అఫ్ ట్రస్టీలని సభకి పరిచయం చేసారు. బోర్ట్ ఆఫ్ ట్రస్టీ నూతన చైర్ పర్సన్ హైమారెడ్డిని, వైస్ చైర్ పర్సన్ శ్రీ రాఘవరావు పోలవరపు గారిని సభకి పరిచయం చేసారు నాగేంద్ర గుప్త. తరవాత న్యూ యార్కు కళాకారులు ప్రేక్షకులు శ్లాఘించిన చరిత్రాత్మకమైన ప్రదర్శన అందించారు. అదే శ్రీ నాగేంద్ర గుప్తా మరో ఆలోచనకి, శ్రీనివాస్ గూడూరు రూపకల్పన చేసిన దృశ్యకావ్యం, "వాగ్గేయకారులు". టిఎల్‌సిఎలోని హేమా హేమీలయిన సీనియర్ నటులతో, త్రి-నగరాలలోని నృత్య గురువులు, సాధన పరంజి, ఇందిరా దీక్షిత్, సత్యప్రదీప్ ల 20 మంది శిష్య బృందంతో కూర్చిన నృత్య రూపకల్పనతో ఉత్కంఠ భరితంగా సాగిందీ రమణీయ సంగీతభరిత రూపకం. భక్తిని, భావాన్ని సంగీతంతో రంగరించి యావత్ తెలుగు జాతి మరిచి పోలేని సంకీర్తనలు అందించిన అన్నమయ్య, త్యాగయ్య, రామదాసుల జీవితాల్లోని ముఖ్య ఘట్టాలని మూడు భాగాలుగా ప్రదర్శించారు.

ఆ వాగ్గేయకారుల అకుంఠిత దైవ భక్తిని, రమ్యమైన వారి సంగీత సృష్టిని కన్నుల విందుగా ప్రదర్శించారు. ప్రతీ సెగ్మెంట్ ముగింపులో నాట్య గురువులు సమకూర్చిన నృత్యాలతో ఆ వాగ్గేయకారుడికి కళా౦జలులు సమర్పించింది ఆ నాటక బృందం. ఆ నాటకానికి శ్రీనివాస్ గూడూరు స్క్రిప్ట్, స్టేజి ప్లే, ఆడియో, దర్శకత్వం అందించగా ప్రొడక్షన్ మేనేజర్ అశోక్ చింతకుంట ఆహార్యం సమకూర్చారు. రూప శిల్పి మాధవి చింతకుంట, ప్రత్యూష గూడూరు, కృష్ణ కుమారి అవాలలు మేకప్ అందించారు. దుర్గ ధనికొండ, భగవాన్ నడింపల్లి స్టేజి సహకారం అందించారు.

తరవాత ఇండియా నుండి వచ్చిన చిత్ర ప్రముఖులు శ్రీ తనికెళ్ళ భరణి ఆహూతులనుద్దేశించి ప్రసంగించారు ఈ నాటి వేడుకలలో టిఎల్‌సిఎ క మరో ఫస్టు, తనికెళ్ళ దర్శకత్వంలో విడుదల అవుతున్న "మిధునం" ఆడియో రిలీజ్. ఇంతకూ ముందెన్నడూ జరగని రీతిలో అధ్యక్షులు శ్రీ నాగేంద్ర గుప్తా అధ్వర్యంలో స్పాన్సర్స్ ఉష, పూర్ణ చంద్రా రెడ్డి అరమల్ల చేతుల మీదుగా విడుదల చేసి మొదటి కాపీని గౌరవ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కీకి అందించారు తనికెళ్ళ భరణి.

ప్రతీ ఉగాదికి లాగే తెలుగు వెలుగు సావనీర్ ని రిలీజ్ చేసింది టిఎల్‌సిఎ. ఈ సందర్భంగా మాటాడుతూ అధ్యక్షులు శ్రీ నాగేంద్ర గుప్త, సావనీర్ కమిటీ చైర్ బాబు కుదరవల్లి, కోచైర్ రాజి కుంచం, సభ్యులు రావు వోలేటి, సలహాదారు శ్రీనివాసు గూడూరు కృషిని కొనియాడారు. సావనీర్ కి ప్రకటనలు ఇచ్చిన దాతలకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టిఎల్‌సిఎ ప్రముఖ ఐటి తెలుగు వ్యక్తి 2011 ఎల్లిస్ అవార్డు గ్రహీత శ్రీ బాబూ రావు మండవని సన్మానించింది.

సునిశిత హాస్యానికి పెరిన్నిక గన్న గుండు హనుమంత రావు తమ హాస్య చతురోక్తులతో ప్రేక్షకులని అలరించారు. సభలో ఉన్న ప్రేక్షకులలో కొంత మందిని అప్పటికప్పుడు ట్రైన్ చేసి వారిని కలుపుకుంటూ ఆయన చేసిన కామెడీ అందర్నీ ఆకట్టుకుంది. కళాకారులకి పెద్ద పీట వేసి రాశికన్నా వాసికి విలువనిస్తుంది టిఎల్‌సిఎ అన్నారు శ్రీ గుండు హనుమంత రావు. తరవాత వేదిక కంట్రోల్ తీసుకున్న సినీ నేపధ్య గాయకులు శ్రీ కృష్ణ చైతన్య, శ్రావణ భార్గవి తమ పాటలతో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. పాత మెలొడీల నుండి నేటి తరం ఫాస్ట్ బీట్ ల వరకు రక రకాలైన పాటలతో ప్రేక్షకులని రంజింప జేశారు. కార్యక్రమానికి మరింత రంగులద్దడానికి విచ్చేసిన అందాల భామలు, నంది అవార్డు గ్రహీత, దూకుడు ఫేం సోనియా మరియు బన్ని హీరొయిన్ గౌరీ ముంజాల్ లు తమ నాట్యాలతో ప్రేక్షకుల మనసులు దోచారు. పిల్లలు పెద్దలు తేడా లేకుండా ప్రేక్షకులు గాయకులూ నటీ నటులతో కలిసి నృత్యాలు చేసారు.

చిట్టచివరగా, అధ్యక్షులు శ్రీ నాగేంద్ర గుప్త ఈ కార్యక్రమ నిర్వహణలో తోడ్పడ్డ కల్చరల్ చైర్ ధర్మా రావు తాపీ, వైస్ ప్రెసిడెంట్ రావు వోలేటి, కోశాధి కారి సత్య చల్లపల్లి, మిగతా కమిటీ చైర్స్ ని అభినందించారు. కార్యదర్శి కృష్ణ శ్రీ వందన సమర్పణ చేస్తూ దాతలకు, మీడియా మిత్రులకు, ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+