NRI News: అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకెళ్తోంది.. మేయర్ విజయలక్ష్మి..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మారిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ప్రపంచ దేశాలు హైదరాబాద్ నగరంలో ఐటీ సంస్థల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. విజయలక్ష్మి బుధవారం వాషింగ్టన్, D.C లో జరిగిన యునైటెడ్ నేషన్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా మేయర్ హైదరాబాద్ లో "తెలంగాణకు హరిత హారం" విశేషమైన విజయగాథను వివరించారు. హైదరాబాద్ రోడ్ల వెంట సెంట్రల్ మీడియన్ లో విస్తృతంగా మొక్కలు నాటడం జరిగిందని వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో, పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీ, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపొందించడంతో పాటు ట్రీ పార్కులు, పంచతత్వ పార్కులు, మేజర్ పార్కుల అభివృద్ధి, కాలనీ పార్కులలో విరివిగా మొక్కలు నాటడం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడంతో పాటు ఫ్లైఓవర్ల కింద గార్డెన్ లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో GHMC అడవుల పెంపకం డ్రైవ్లు, పట్టణ ప్రాంతాల్లో వర్టికల్ గార్డెనింగ్, పర్యావరణ అనుకూల వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతుల తో సహా అనేక ప్రగతిశీల చర్యలు అమలు చేశామని చెప్పారు. ఈ ప్రయత్నాలు నగరాల సౌందర్య ఆకర్షణను మెరుగుపరచడమే కాకుండా వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో కూడా గణనీయంగా దోహదపడ్డాయని పేర్కొన్నారు.
వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత సవాళ్లను పరిష్కరించడంలో సామూహిక ప్రపంచ చర్య ప్రాముఖ్యతను ఈ సందర్భంగా మేయర్ వివరించారు. స్థిరమైన పట్టణ ప్రణాళిక, సమాజ, భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరాణాన్ని సృష్టించడంలో పౌరుల చురుకైన ప్రమేయం అవసరమని వివరించారు.

అంతర్జాతీయ ప్రముఖులు, విధాన నిర్ణేతలు, పర్యావరణవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన ప్రేక్షకులు, మేయర్ ప్రదర్శనను ఆశాకిరణంగా, సానుకూల మార్పును పెంపొందించడంలో నిశ్చయించుకున్న నాయకత్వ శక్తి నిదర్శనంగా నిలిచారని తెలిపారు. అంతకు ముందు విజయలక్ష్మి అమెరికాలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ ఆడారు.












Click it and Unblock the Notifications