కేసీఆర్ జాతీయ పార్టీ: లండన్లో జోష్, దేశ్ కీ నేత అంటూ నినాదాలు
మరికొద్దీ గంటల్లో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ గురించి ప్రకటన చేయబోతున్నారు. దీనికి సంబంధించి యావత్ తెలంగాణే కాదు.. విదేశాల్లో ఉన్న ఆ పార్టీ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వింగ్ కూడా జోష్లో ఉంది. దేశ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకుంటోంది. ఈ మేరకు ఖుషీగా ఉన్నారు.
సీఎం కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని యూకేలో ఉన్న ఎన్నారైలు ఆకాంక్షిస్తున్నారు. లండన్లో చారిత్రక లండన్ బ్రిడ్జీ వద్ద ఎన్నారైలు మీట్ అయ్యారు. 'దేశ్ కీ నేత కేసీఆర్' అని నినాదాలు చేశారు. తెలంగాణ ఎన్నారైలతోపాటు ఇత రాష్ట్రాల ఎన్నారైలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తోందని వారు అన్నారు. ఇండియా అభివృద్ధి చెందాలంటే అది కేసీఆర్తో సాధ్యం అని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు.కేసీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అనిల్ కూర్మాచలంతోపాటు పలువురు ఎన్నారైలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ పార్టీ పెట్టడంతో కేసీఆర్.. సీఎం పదవీకి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ సీఎం పదవీ చేపడుతారని జోరుగా చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీలో దీనికి సంబంధించి అంతర్గత చర్చ నడుస్తోంది.