భారతీయుడి మృతి, చెలరేగిన హింస
సింగపూర్: సింగపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భారతీయుడు మృతి చెందడంతో దాదాపు 400మందికి పైగా దక్షిణాసియా వలస కార్మికులు చేపట్టిన ఆందోళన హింసకు దారి తీసింది. సుమారు 40ఏళ్ల తర్వాత అల్లర్లు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా సింగపూర్ ఉలిక్కిపడింది. సింగపూర్లోని లిటిల్ ఇండియా జిల్లాలో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
భారత్కు చెందిన శక్తివేల్ కుమారవేల్(33) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కార్మికులు ఆందోళకు దిగారు. స్థానిక హెంగ్ హప్పూన్ కంపెనీలో రెండేళ్లుగా పనిచేస్తున్న శక్తివేల్ను ఆదివారం సాయంత్రం టెక్కా సెంటర్ సమీపంలో ప్రైవేటు బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన దక్షిణాసియా వలస కార్మికులు ఆందోళన చేపట్టారు.
పలువురు ఆందోళనకారులు మూడు పోలీసు వాహనాలు, పలు ప్రైవేటు వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల దాడిలో 10మంది పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ కమాండోలు ఆందోళనలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి 27 మంది కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనలో హింసకు పాల్పడిన వారికి సుమారు 7ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఘటనపై స్పందించిన సింగపూర్ ప్రధాని లీ సేన్ లూంగ్ మాట్లాడుతుూ.. హింసకు, విధ్వంసానికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని, నిందితులను కఠినంగా శిక్షించనున్నట్లు తెలిపారు. దాడులకు, హింసకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ అల్లర్లు ప్రజా రవాణాకు ఎంతో ఇబ్బందికరంగా మారాయని పోలీసులు తెలిపారు. భయంకర వాతావరణం ఏర్పడిందని చెప్పారు. సింగర్పూర్లో ఇంతకుముందు 1969లో ఇలాంటి ఘటనే చోటు చేసుకున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.