తిరుమలలో TCS ఆధ్వర్యంలో..: వరల్డ్ క్లాస్
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 73,324 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,955 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.89 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 10 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు నుండి ఎనిమిది గంటల సమయం పట్టింది.
తిరుమలలో శ్రీవేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపుగా తుదిదశకు చేరుకున్నాయి. ఈ ఆధునికీకరణ పనులను తాజాగా టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షించారు. మ్యూజియం ఆధునీకరణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఆధ్వర్యలో ఈ పనులు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడారు. ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మ్యూజియం ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణ పనులు నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.
సుమారు 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మ్యూజియంలో దాదాపు లక్ష చదరపు అడుగుల మేర పనులు పూర్తయ్యాయని, మొత్తం 14 గ్యాలరీలను అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు ప్రత్యేక అనుభూతి కలిగేలా తీర్చిదిద్దినట్లు చెప్పారు. తిరుమల క్షేత్ర వైభవం, ఆలయ చారిత్రక నేపథ్యం, శాసనాలు, అన్నమాచార్య గ్యాలరీ, పల్లవులు, చోళులు, విజయనగర రాజులు వంటి వివిధ రాజవంశీయులకు శ్రీవారితో ఉన్న అనుబంధాన్ని గ్యాలరీలలో ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు.
మ్యూజియాన్ని దీర్ఘకాలం పాటు పర్యవేక్షించడానికి ఓ ప్రొఫెషనల్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడంపై కూడా చర్చించామని, భక్తులకు మెరుగైన అనుభవం కల్పించేలా ప్రవేశ, నిష్క్రమణ సదుపాయాలు, క్యాఫెటీరియా, సావనీర్ షాప్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు వెంకయ్య చౌదరి వివరించారు. భక్తుల తిరుమల యాత్రకు ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక అనుభూతి కలిగించేలా ఈ మ్యూజియాన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యూజియంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications