ఆహారకల్తీ ముఠాలపై కూంబింగ్.. 100మంది పోలీసులతో ఎన్ఫోర్స్మెంట్ టీం: డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆహార కల్తీ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన దాడులలో 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు, హానికర రసాయనాలు, ఫ్యాబ్రిక్ డై లు, టాల్కం పౌడర్ లు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. హెచ్ ఫాస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజుల్లో వందల సంఖ్యలో కేసులు నమోదుచేసి టన్నుల కొద్ది కల్తీ పదార్థాలను సీజ్ చేశారు.
ఆహార కల్తీ ముఠాలపై కూంబింగ్: డీజీపీ సీవీ ఆనంద్
అంతేకాదు ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, భారత న్యాయ సంహిత సెక్షన్ 110 క్రింద హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కల్తీ విపరీతంగా పెరిగిన క్రమంలో ఆహార కల్తీ ముఠాలపై కూంబింగ్ ప్రకటించారు తెలంగాణా డీజీపీ సీవీ ఆనంద్. ఆహార కల్తీ సమస్య నివారణకు సమగ్ర చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

ఆహార కల్తీ నివారణకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్
ఆహార కల్తీ నియంత్రణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆహార కల్తీపై కూంబింగ్ లో భాగంగా అడుగడుగునా జల్లెడ పడతాం అన్నారు. ఈ విభాగానికి వంద మంది పోలీసులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఫుడ్ ఇన్స్పెక్టర్ల వ్యవస్థను, డ్రగ్ కంట్రోల్ అథారిటీని ఒకే గొడుగు కిందకి తీసుకు వస్తున్నట్టు, దీని ద్వారా సంబంధిత శాఖలలో సమన్వయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
క్యాన్సర్ కేసుల పెరుగుదలతో నిర్ణయం
రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముఖ్యమంత్రి ఆహార కల్తీని అరికట్టడం పైన కృత నిశ్చయంతో ఉన్నారని డిజిపి సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పోలీసు శాఖ ఆహార కల్తీ ముఠాల పైన ప్రత్యేక దృష్టి సారిస్తుందని, కల్తీ ముఠాల పైన ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయిందని వెల్లడించారు. త్వరలో "టీసేఫ్" పేరుతో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.
టీ సేఫ్ వ్యవస్థ ద్వారా తనిఖీలు, విశ్లేషణ
టీ సేఫ్ వ్యవస్థ ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహిస్తారని, నమూనాలను సేకరించి విశ్లేషణ చేస్తారు అన్నారు. క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే కఠిన వైఖరి అవలంబిస్తున్నట్టు డిజిపి సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించడానికి, కల్తీని నివారించడానికి తమ వంతుగా కల్తీ పైన పోలీస్ యుద్ధం కొనసాగుతుందన్నారు.



Click it and Unblock the Notifications