TAL ఆధ్వర్యంలో లండన్లో తెలుగు మాతృ భాషా దినోత్సవం: వెంకయ్య ప్రసంగం
లండన్: భాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, వాడుక బాషా ఉధ్యమ నాయకుడు, తాత్వికుడు గిడుగు శ్రీరామమూర్తి జయంతిని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్(తాళ్) ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై ప్రసంగించారు.
తాళ్ ట్రస్టీ గిరిధర్.. వెంకయ్యనాయుడుకు స్వాగతం పలుకుతూ వేదిక మీదకు ఆహ్వానించారు. తాళ్ సలహాదారులు డాక్టర్ రాములు దాసోజు.. వెంకయ్యనాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బీ రామానాయుడు ఆయన 50వ సంవత్సరాల రాజకీయ జీవితం నమ్మిన ఆశయాలకు, విలువలకు అనుగుణంగా నడిచిందని చెప్పారు.

తాళ్ ఛైర్మన్ భారతి కందుకూరి.. తాము లండన్ లో గత 10 సంవత్సరాలుగా రెండు తెలుగు కల్చరల్ సెంటర్స్ నిర్వహిస్తుందని, అందులో తెలుగు భాష, సంగీతం, నృత్యాలు నేర్పుతున్నామని చెప్పారు. తాళ్ సీపీ బ్రౌన్ సమాధిని పునరుద్ధరించి నడుపుతుందని చెప్పారు. తాళ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రతి వేసవిలో రెండు నెలలు నిర్వహిస్తుందని చెప్పారు. ఇవేగాక ఉగాది, సంక్రాంతి నిర్వహిస్తుంది. దాదాపు 100 మంది కార్యకర్తలు ఇందులో పనిచేస్తారని చెప్పారు.
తాల్ సభ్యులు గిరి ధవళ మాట్లాడుతూ.. గిడుగు భాషా వేత్తగా ఎంత గొప్ప కృషి చేశారో, సంఘ సంస్కర్తగా కూడా ఎంతో పోరాడారని చెప్పారు. సవర భాషకు చేసిన సేవ గొప్పదన్నారు. అంతకంటే ముఖ్యంగా పేరు ప్రఖ్యాతి గురించి పనిచేయలేదని, గొప్ప మానవీయ విలువలున్న మనిషని చెప్పారు.
భాషా సంస్కృతులే భవిష్యత్తులో మన చిరునామాను తెలియజేస్తాయని, అలాంటి భాషను, సంస్కృతిని కాపాడుకోవడమే తెలుగు భాషా దినోత్సవ సంకల్పం కావాలని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న ఆయన.. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని వారి స్మృతికి నివాళులు అర్పించిన వెంకయ్యనాయుడు.. ప్రతి ఒక్కరికీ మాతృభాషను చేరువ చేయాలన్న గిడుగు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అమ్మభాషను కాపాడుకునేందుకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
భారతదేశం స్వరాజ్యం సంపాదించుకున్న 75 ఏళ్లలో విదేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో భారతీయులు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్న వెంకయ్యనాయుడు.. ముఖ్యంగా భారతీయులను బానిసలుగా చూసిన బ్రిటీష్ గడ్డ మీద భారతీయులకు ఈరోజు అందుతున్న గౌరవం చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపారు. వసుదైవ కుటుంబ భావనను బలంగా నమ్మిన భారతీయులు సనాతన కాలం నుంచి కోరుకున్న నిజమైన పురోభివృద్ధి ఇదేనని పేర్కొన్నారు. మన భాషా సంస్కృతులను కాపాడుకుంటూ, ముందు తరాలకు చేరవేయాలన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ సంస్థకు అభినందనలు తెలియజేసిన వెంకయ్యనాయుడు.. కాలానుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతున్న తీరు ఆదర్శనీయమని తెలిపారు.
దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, ఈ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా మార్చారన్న వెంకయ్యనాయుడు, ఈ భావన మానవాళి పురోభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఆజాదీకా అమృత మహోత్సవ వేడుక లక్ష్యం, వేడుకలు చేసుకోవడం మాత్రమే కాదని, స్వరాజ్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల ప్రేరణను ముందు తరాల్లో నింపటమని స్పష్టం చేశారు. అతిబలమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తున్న భారత్.. గత 75 ఏళ్లలో వ్యాక్సిన్ కోసం విదేశాల మీద ఆధారపడే స్థాయి నుంచి.. దేశ విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం నిజమైన పురోగతి అని స్పష్టం చేశారు.
భాష అంటే మనం మాట్లాడే నాలుగు పలుకులే కాదన్న వెంకయ్యనాయుడు.. మన పిల్లలకు మన భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దగడం మాత్రమే గాక, మన పండుగల్లోని పరమార్థాన్ని తెలియజేస్తూ వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు గ్రంథ పఠనాన్ని ప్రోత్సహించాలన్న ఆయన.. తెలుగు కవులు నవ్యమార్గంలో యువతకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. మన ప్రాచీన గ్రంథాల్లో మన సంస్కృతి మాత్రమే గాక, సాంఘిక జీవనం కూడా భాగమై ఉందనిర, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ముందు తరాలకు అందజేయాలని స్పష్టం చేశారు.
భాషను కాపాడుకోవడంతోపాటు నలుగురికి సాయం చేయడం మరవొద్దన్న వెంకయ్యనాయుడు.. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ప్రవాస భారతీయులు చూపిన చొరవ దేశం మరువదన్నారు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ కార్యనిర్వాహక వర్గంతోపాటు బ్రిటన్లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి.
తాళ్ తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఇక్కడ క్లిక్ చేయండి
https://onedrive.live.com/?authkey=%21AC%2DzmknswoZHDs4&id=CA62398C5D4629EE%21187735&cid=CA62398C5D4629EE












Click it and Unblock the Notifications