దారుణం: తనకు దక్కలేదని సహోద్యిగిని ప్రియుడిని చంపేసిన ఎన్నారై
శాన్ఫ్రాన్సిస్కో: ఓ ప్రవాస భారతీయుడు అమెరికాలో దారుణానికి ఒడిగట్టాడు. తనతో డేటింగ్కు వచ్చేందుకు ఓ యువతి అంగీకరించడం లేదన్న ఆగ్రహంతో ఆమె బాయ్ఫ్రెండ్ను హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
కాలిఫోర్నియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కెవిన్ ప్రసాద్ (31) శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ సేవలందిస్తున్నాడు. అక్కడే ఓ యువతి కూడా పనిచేస్తోంది. ఆమెను ఎలాగైనా వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రసాద్ పలుమార్లు ఆమెను డేటింగ్ కు రమ్మని ఆహ్వానించాడు.
లోబర్చుకోవాలనుకున్నా..
అంతేగాక, నగలు కూడా బహూకరించి లోబర్చుకోవాలని చూశాడు. అయితే, దాన్ని తిరస్కరించిన ఆమె.. తనకు అప్పటికే మార్క్ మంగాక్కట్ (31) అనే బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, తమకు మూడేళ్ల బిడ్డ కూడా ఉందని చెప్పింది. దీంతో ఆమెను దక్కించుకునేందుకు అతడ్ని ఎలాగైనా మట్టుబెట్టాలని అనుకున్నాడు ప్రసాద్.
ఆమె ప్రియుడిని చంపేశాడు
ఈ క్రమంలో తలకు ముసుగు ధరించి.. మంగాక్కట్ కారు వద్దకు వచ్చి అతన్ని తుపాకితో కాల్చి చంపాడు కెవిన్ ప్రసాద్. విచారణ ప్రారంభించిన పోలీసులకు తొలుత నిందితుడి గురించి ఒక్క క్లూ కూడా లభించలేదు. ఆపై విచారణలో మంగాక్కట్కు ఎటువంటి గ్యాంగులతోనూ సంబంధం లేదని తెలిసింది.
ఆమె వాంగ్మూలంతో..
ఇదే సమయంలో మృతుడి గర్ల్ఫ్రెండ్, ప్రసాద్ సహోద్యోగిని అయిన యువతిని కూడా పోలీసులు విచారించారు. పనిచేసే చోట ప్రసాద్ తనను డేటింగ్కు రావాలని ఒత్తిడి చేస్తుండేవాడని, తాను నిరాకరించినా ఒత్తిడి చేసేవాడని ఆమె తెలిపింది. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు.
దారుణం వెలుగులోకి..
ఈ క్రమంలో ప్రసాద్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడైన డొనోవాన్ మ్యాథ్యూ రివీరా సహాయంతో అతను మంగాక్కట్ ను హత్య చేశాడని పోలీసులు తేల్చారు. అతనిపై హత్య కేసు పెట్టి కోర్టుకు తరలించారు. నిందితుడు కెవిన్ ప్రసాద్కు ఈ నేరం కింద మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.