సయీ రాస్తా
ఇప్పుడు కలికంలోకి కూడా మిగలకుండా అంతరించినపోయిన ఫోనీషియన్లు అనే సెమెటిక్ జాతివారి లిపి నుంచి నేటి ఐరోపా భాషల లిపి పుట్టింది. ఆంగ్ల భాష కూడా అందులో ఒకటి. ఈ ఆంగ్లం నుంచి అమెరికన్ భాష పుట్టింది. అమెరికా వారు రాసే ఆంగ్ల భాషను ఆంగ్లం అనటానికి వీలు లేదనీ, స్పెల్లింగుల్లో అనవసరమైన ఆడంబరాన్నీ, పరాయి భాషల ప్రభావాన్నీ తాము ఏరి వేస్తున్నాం కాబట్టి దానిని 'అమెరికన్' అనాలనీ మహా రచయిత మార్కు ట్వయిన్ వాదించేవాడు. ఆంగ్ల సారస్వతానికీ, అమెరికన్ సారస్వతానికీ స్పష్టమైన తేడా చూపినవాడు మార్కు ట్వయిన్. ప్రపంచంలో ప్రాంతీయ సాహిత్యం అనేదానికి ఆయనే ఆద్యుడు. టామ్ సాయర్ నుంచీ, హకల్ బెరీఫిన్ నుంచీ ఆధునిక అమెరికన్ సాహిత్యం పుట్టిందని ఎర్నెస్ట్ హెమింగ్వే గర్వంగానూ, భక్తితోనూ చెప్పేవాడు. తెలుగు సాహిత్యంలో తెలంగాణా సాహిత్యానికీ, భాషకూ, ఆంధ్రప్రాంతపు సాహిత్యానికీ, భాషకూ ఇలాంటి తేడాయే ఉన్నదని 'చౌరస్తా' అనే కథల సంపుటి చదువుతున్నప్పుడు నాకు అనిపించింది.
చారిత్రక, రాజకీయ పరిణామాల వల్ల, భౌగోళిక కారణాల వల్ల తెలంగాణా భాష మరాఠీ, హిందీ, ఉర్దూ, పర్షియన్, అరబ్బీ భాషల ప్రభావానికి గురైనది. దాని వల్ల అది మరింత పరిపుష్టమూ, శక్తిమంతమూ అయింది. సంపన్నమూ అయింది. అది తీయందనాలూ నేర్చింది. అయితే వీరేశలింగం, గురజాడ, శ్రీశ్రీ వంటి సాహిత్యోద్యమకారులు తెలంగాణ మాండలికంలో రాయలేదు. ఒక తెలంగాణాలో అట్టి మహానుభావులు ఎవరైనా అలాంటివి రాసినా అవి కావాల్సినంత ప్రచారానికి నోచుకోలేదు. వారికీ ప్రచారం లేదు. లేదా తెలంగాణాకు అలాంటి ప్రచార విద్య తెలీదు. కారణమేమైనా తెలంగాణా తెలుగు తీయదనమూ, తెలంగాణ ప్రాంతపు అద్భుత సాహిత్యమూ ఆంధ్రప్రాంతంలో ఎక్కువ మందికి తెలీకుండా పోయింది.
............. ............. .............
జీవితాన్ని శాసిస్తున్న శక్తులూ, జీవితాన్ని పీడిస్తున్న దుష్టశక్తులూ భారతదేశమంతటా ఒకటే. మానవ శత్రువులకు ప్రాంతీయ భాషా భేదాలుండవు. సమస్త మానవాళికీ శత్రువు ఒక్కడే. వాడిని ఎదిరించి పోరాడేవాళ్లంతా ఒక్కటే. అయితే ఈ పోరాడే వాళ్లకి వివిధ ప్రాంతాలు, వివిధ భాషలూ, వివిధ నేపథ్యాలూ వుండవచ్చు. ఈ భేదాలు బాహ్యమైనవి. అంతరంగానికి సంబంధించినవి కావు. భాష గానీ, పలుకుబడి గానీ ఒక చిరునామా లాంటిది. అది ఒక చెహరా. చెహరాలు చాలా ముఖ్యం (చెహరా అంటే ముఖం అని నా అభిప్రాయం కాదు, అడ్రసు అని నా ఉద్దేశం) తెలంగాణాలోని నా తోబుట్టువు ఈ చెహరాని కాపాడుకుని తమ వ్యక్తిత్వాన్నీ, ఆత్మగౌరవాన్నీ సముజ్వలంగా ఆవిష్కరించుకోవాలనీ, సగర్వంగా నిలవాలనీ నేను కోరుకుంటున్నాను. తెలంగాణాలోని తీయదనం దేశమంతా వ్యాపించాలనీ, తెలంగాణా పరిమళం విశ్వమంతా వ్యాపించాలనీ ఆకాంక్ష. భాష అమ్మలాంటిది. పలుకుబడి తండ్రిలాంటిది. ఈ రెంటినీ కాపాడుకోలేకపోతే అమ్మనీ, నాన్ననీ పోగొట్టుకున్నవాళ్లే అవుతారు. లోకంలో ఎవరూ అలాంటి అనాథలుగా మిగలకూడదు. మనకేం తక్కువ? అమ్మ లేదా? నిండుగా, చల్లగా, ప్రేమగా వుంది. మనకేం లోటు? నాన్న లేడా? దర్జాగా, దర్పంగా, వాత్సల్యంగా ఉననాడు. తెలుగు మాతృభాషగా వున్న ప్రాంతాలన్నీ ఇలాంటి ఆత్మగౌరవంతో రాయాలని నేను చెపితే ఎవరైనా ఏమైనా అనుకోవచ్చు గానీ కోరుకుంటే తప్పా? జవ చచ్చిన తెలుగు భాష తిరిగి మన నోటికి తీయగా ఉండాలంటే, మన చెవులకు కమ్మగా వినిపించాలంటే తెలంగాణ, రాయలసీమ మాండలికాలు మరింత ఎక్కువగా వ్యాప్తి చెందాలి. ప్రజలూ, వారి భాషా గెలవాలి. ప్రజా సంస్కృతి వర్ధిల్లాలి.












Click it and Unblock the Notifications