పార్ట్-25
అసెంబ్లీ అట్టుడికినట్లు ఉడుకుతోంది. ఎమ్మెల్యే నాయక్ హత్యకు శాసనసభలో గందరగోళం. ట్రైబల్ ఎమ్మెల్యను నక్సల్స్ హత్య చేశారనే వార్త ఎవరికీ మింగుడుపడడం లేదు. నిజానికి నాయక్ ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడు. అయినా అధికార, ప్రతిపక్షాలు ఏకమై హత్యను ఖండించాయి. ఒక గిరిజన ఎమ్యేల్యేను హత్య చేయడమేమిటనేది ప్రశ్న. ఇదంతా ప్రెస్ గ్యాలరీలోంచి చూస్తున్న రాంరెడ్డి ఆసక్తిగా చూడసాగాడు.
ప్రభుత్వం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని సమర్థిస్తూ అన్ని పార్టీలవారు మాట్లాడారు. నక్సల్స్తో చర్చలు ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రతిపక్షాల నాయకులు కోరారు. నాయక్ హత్య రాజకీయల్లో ఒక కొత్త మలుపుకు కారణమైంది.
''నక్సల్స్ చేతిలో ప్రజాప్రతినిధి మరణిస్తే తద్వారా జరిగే ఉప ఎన్నికలో ఆ స్థానంలో ఏ పార్టీ కూడా పోటీ పడకూడదు. మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబానికి చెందినవారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాల''ని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. దానికి అన్ని పార్టీలు ఆమోద ముద్ర వేశాయి.
అంటే గ్రామ పంచాయతీ స్థాయి నుంచి లోక్సభ స్థాయి వరకు ఇది వర్తిస్తుందన్న మాట అని అనుకున్నాడు రాంరెడ్డి. ఇది మంచిదా, చెడ్డదా అనే ఆలోచన ఆ సమయంలో రావడం దుర్లభమే. అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తే సానుభూతి పవనాలు పోగొట్టుకోవడమే అవుతుందని అన్ని పార్టీలకూ తెలుసు. అందుకే మారుమాట్లాడకుండా దానికి ఆమోదం తెలియజేశాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ బిసీల మద్దతు కూడగట్టుకోవడం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్న విషయం తెలియంది కాదు. క్రమక్రమంగా పరిస్థితులు దళిత, వెనుకబడిన వర్గాల పట్ల అనుకూలంగా మారుతూ వస్తున్నాయి. అందుకు తగిన ప్రాతిపదిక ప్రజాఉద్యమాల్లోనే ఉన్నట్లనిపించింది రాంరెడ్డికి. ఈ విషయంలో ప్రజా ఉద్యమాలు కూడా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోంది. నాయక్ హత్య విషయంలో ఇదే జరిగింది. హత్యకు గురి అయిన శాసనసభ్యుడు గిరిజన తెగకు చెందినవాడు కావడం వల్ల నక్సల్స్ ఏదో మేరకు ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన స్థితిలో పడ్డారు. సమాజంలో వర్గం మాత్రమే ప్రధానమనేది క్రమక్రమంగా బలహీనపడుతూ, కులం కూడా ఇక్కడ పునాది అంశమే అనేది బలంగా నాటుకుపోతూ రావడం క్రమక్రమంగా జరుగుతూ వచ్చింది. దీనికి తగిన సమాధానం ఆచరణలో చూపించడంలో నక్సల్స్ విఫలమయ్యారా? విఫలమయ్యారనే రాంరెడ్డి నమ్ముతున్నాడు. ఈ సమయంలో రాంరెడ్డికి 1986 సంఘటనలు గుర్తొచ్చాయి.
................ ......................... ........................
ఎడిటర్ రాంకిషన్రావు ఎదురుగా ఛీఫ్ రిపోర్టర్ లక్ష్మణ్, రాంరెడ్డి కూర్చున్నారు. ఇంత వరకు సాగిన రిజర్వేషన్ వ్యతిరేక, అనుకూల ఉద్యమాల గురించి మాట్లాడుతున్నారు. ఆ ఉద్యమాలను కవర్ చేసే బాధ్యత రాంరెడ్డిది కాబట్టి ఆ చర్చల్లో అతనూ ఉన్నాడు. అప్పటి ఆ ఉద్యమాలు సాగబట్టి నెల రోజులవుతోంది.
బిసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే మురళీధర రావు కమీషను సూచనలను అమలు పరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఉస్మానియా యూనివర్శిటీలో నిప్పు రాజుకుంది. అగ్రకులాల విద్యార్థులు కొంత మంది కలిసి నవ సంఘర్షణ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి మొదట జాతీయ విద్యార్థి సంఘం నాయకులతో మొదలైనప్పటికీ క్రమక్రమంగా అగ్రవర్ణాల విద్యార్థులు దాని వెనుక ర్యాలీ కావడం మొదలైంది. రాష్ట్రం అట్టుడికిపోతోంది. దీనికి ప్రతిగా బిసీ విద్యార్థులు ఏకమై ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే వీరికి అగ్రవర్ణాల విద్యార్థుల ఉద్యమ రూపాలను ఎదుర్కోవడం కష్టంగానే ఉంది. నవసంఘర్షణ సమితి ఉద్యమంలో కొత్త కొత్త పోకడలు, కనీవినీ ఎరుగని కార్యక్రమాలు మొదలయ్యాయి.
మెడికల్ విద్యార్థులు, ఇంజనీరింగ్ కోర్సులు చదివే విద్యార్థులు ఒక రోజు బూట్ పాలిష్ చేసే కార్యక్రమం చేపట్టారు. మరో రోజు వీధులు ఊడ్చే కార్యక్రమం చేపట్టారు. మరో రోజు మరుగుదొడ్లను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. ఇలా కొత్త కొత్త రూపాలతో ఉద్యమం సాగుతుండడంతో దానికి విశేష పత్రికా ప్రచారం లభించిసాగింది. అయితే బీసి విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలేవీ లేవు. వారు ధర్నాలు, ప్రదర్శనలు లాంటి సంప్రదాయబద్దమైన ఆందోళనాకార్యక్రమాలే చేపట్టసాగారు. అటువంటి నూతన పద్ధతులు బీసి విద్యార్థులకు లేకపోవడానికి కారణమేమిటో ఎవరికీ అంతుబట్టలేదు.
''ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లే'' అన్నాడు ఎడిటర్ రాంకిషన్ రావు ఈజీ చైర్లో వెనక్కి ఒరుగుతూ. ''ప్రభుత్వానికి ఏం కాదనుకుంటా. అధికారంలో ఉన్న పార్టీకి కావాల్సింది లభిస్తుంది'' అన్నాడు రాంరెడ్డి. ''జీవో రద్దు చేస్తే బీసీలు వ్యతిరేకమవుతారు. రద్దు చేయకపోతే ఈ ఉద్యమం ఇంకా విస్తరించేట్లు ఉంది'' అన్నాడు లక్ష్మణ్.
''బహుశా రిజర్వేషన్లు అమలు కాకుండానే తన ప్రయోజనాన్ని ప్రభుత్వం నెరవేర్చుకుంటుందని నాకు అనిపిస్తోంది'' అన్నాడు రాంరెడ్డి. నూనూగు మీసాల నూత్న యవ్వనం. చిదిమితే పాలు గారే బుగ్గలు. చూస్తే జీవితం లోతులు చూడనట్లు కనిపించే వాలకం. రాంరెడ్డి మాటలను నమ్మానిపించలేదు ఎడిటర్కు గానీ, ఛీఫ్ రిపోర్టరుకు గానీ. రాంరెడ్డే మళ్లీ అందుకున్నాడు. ''రిజర్వేషన్లను ఏదో రకంగా అమలు చేయలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం తాను రిజర్వేషన్లను అమలు చేయడానికి సిద్ధమే కానీ కాలేదు ఏం చేస్తామంటుంది. దాంతో బీసీల సానుభూతి సంపాదించుకుంటుంది. అటు అగ్రవర్ణాల విద్యార్థులు సంతృప్తి చెందుతారు'' అన్నాడు రాంరెడ్డి.
''నాకెందుకో ఇది సాధ్యమయ్యేట్లు కనిపించడం లేదు'' అన్నాడు ఎడిటర్. ''ఏమవుతుందో చూద్దాం లెండి'' అన్నాడు ఛీఫ్ రిపోర్టర్. ''కానీ ఇక్కడో ముఖ్యమైన మార్పును మనం కొంత ఫోకస్ చేయాల్సి ఉంటుంది, సార్!'' అన్నాడు రాంరెడ్డి. ఛీఫ్ రిపోర్టర్ రాంరెడ్డి వైపు వింతగా చూశాడు. ఎడిటర్ ఏమిటన్నట్లు చూశాడు. ''రెండు విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. వీటిని మనం కొంత ఫోకస్ చేయగలిగితే కింది కులాల వాళ్లకు మన పరిధిలో న్యాయం చేసినవాళ్లమవుతాం'' అన్నాడు రాంరెడ్డి.
''ఏమిటవి?'' అడిగాడు ఎడిటర్. ఎదుటివారి నుంచి వచ్చే అభిప్రాయాలను జాగ్రత్తగా వినిడం ఆయన అలవాటు. ఏముందిలే అనుకునే తత్వం కాదు. ఏదైనా కొత్త ఆలోచన వస్తే, దాన్ని అమలు చేస్తే సమాజికి మేలు చేసినవాళ్లం అవుతాం, పత్రికకు బాగుంటుంది అనేది ఆయన ఆలోచన. అదే తీరులో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వడం, వారు రాయదల్చుకున్నది పత్రిక ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు భంగం కలగతనంత వరకు అనుమంతించడం ఛీఫ్ రిపోర్టర్ లక్షణం. ఇవి రెండే అలా మాట్లాడడానికి రాంరెడ్డికి అవకాశం కల్పించింది.
రాంరెడ్డి ఛీఫ్ రిపోర్టర్ వైపు చూశాడు. ఆయన రాంరెడ్డిని ప్రోత్సహిస్తూ నవ్వాడు. ఎడిటర్ ముందుకు టేబిల్ మీదికి వంగి పేపర్ వెయిట్ను గుండ్రంగా తిప్పి రాంరెడ్డి వైపు చూశాడు.












Click it and Unblock the Notifications
