నేడు.. జిన్పింగ్ తో ప్రధాని మోదీ భేటీ: ఈ మూడింటిపైనే ఫోకస్?
ఢిల్లీ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేడు ఆరంభం కాబోతోంది. ఈ సమ్మిట్ సైడ్ లైన్స్ లో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముఖాముఖి భేటీ అయ్యారు. నేడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం భారత్ మండపంలో ఈ సమావేశం ఏర్పాటుకానుంది. ఆసియాలో అత్యంత శక్తిమంతమైన ఈ రెండుదేశాల మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలకు రంగం సిద్ధమైంది.
ఈ ప్రత్యేక భేటీపైనే అందరి దృష్టీ నిలిచింది. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద చాలాకాలంగా నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడమే ఈ చర్చల ప్రధాన అజెండాగా మారే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులు, సిక్కిం సమీపంలోని డోక్లామ్ ట్రైజంక్షన్.. వంటి సమస్యాత్మక, సున్నిత అంశాలు కూడా ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అవన్నీ కూడా చాలాకాలం నుంచీ పరిష్కారానికి నోచుకోనివే.

సరిహద్దుల్లో పూర్తిస్థాయిలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి ఇరు దేశాల నేతలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. ఎల్ఏసీ నుండి అదనపు సైనికులను వెనక్కి పిలిపించడం, అక్కడ ఉద్రిక్తతలను తగ్గించే ప్రణాళికపై ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ వివాదాలను కయ్యానికి పోకుండా శాంతియుత చర్చల ద్వారే పరిష్కరించుకోవాలన్న చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీ విస్తృత ప్రాధాన్యతను సంతరించుకుంది.
సరిహద్దు వివాదాల పరిష్కారంతో పాటు దౌత్య, ఆర్థిక సంబంధాల బలోపేతంపై కూడా ఈ కీలక భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. అరుదైన ఖనిజాల లభ్యత, పరస్పర పెట్టుబడులు, రవాణా రంగాలలో సహకారం పొందడానికి భారత్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలోనే చైనా నుంచి వచ్చే పెట్టుబడులకు సంబంధించి గతంలో ఉన్న కఠిన నిబంధనలను భారత్ ఇటీవలే కొంతవరకు సడలించింది కూడా. ఈ నేపథ్యంలో రెండు పొరుగు దేశాల మధ్య వాణిజ్య బంధం బలపడటానికి ఇదొక మంచి వేదిక అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
China and India are arranging for the bilateral meeting between President Xi and Prime Minister Modi.
— Xu Feihong (@China_Amb_India) September 11, 2026
This will be the third year in a row for the two leaders to meet with each other, following their meetings in Kazan and Tianjin.
China will work with India to act on the… pic.twitter.com/jD3GeZpjZk
మరోవంక.. ఈ మధ్యాహ్నం 2:35 గంటలకు బ్రిక్స్ సభ్యదేశాల శిఖరాగ్ర సదస్సు అధికారికంగా మొదలుకానుంది. సాయంత్రం 5 గంటలకు భారత్ మండపం వద్ద ఆయా దేశాధినేతలు, ప్రధానమంత్రులు కలిసి గ్రూప్ ఫొటో దిగనున్నారు. బ్రిక్స్ 18వ సదస్సుకు సూచికగా ఉమ్మడిగా మొక్కలు నాటుతారు. ఆ తర్వాత రాత్రి 7:30 గంటలకు సభ్య దేశాల ప్రతినిధులకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. బ్రిక్స్ సమ్మిట్ ను గ్లోబల్ గ్రోత్ ఇంజిన్ గా మార్చాలనేే పట్టుదలతో ఉంది.. కేంద్రం.












Click it and Unblock the Notifications
