వ్యవస్థలో జీర్ణమైన శ్రీశ్రీ
శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కె. రోశయ్య, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఏ మాత్రం సంశయించుకుండా పాల్గొన్నారు. నిజంగానే ఇంకా శ్రీశ్రీ విప్లవ రాజకీయాల ప్రతినిధిగానే కొనసాగుతూ ఉన్నట్లయితే అందుకు ఆస్కారం ఉండేది కాదు. అయితే పాలక వర్గాలు క్రమక్రమంగా కొంత మందిని సొంతం చేసుకుంటాయి. అలా శ్రీశ్రీని పాలక వర్గాలు సొంతం చేసుకున్నాయి. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ మీద శ్రీశ్రీ విగ్రహం స్థాపించడం అందుకు మరో ఉదాహరణ.
ఒక వైపు ప్రజారాజకీయాలతో విభేదిస్తూ మరో వైపు ఆ రాజకీయాలను ప్రచారం చేస్తున్న శ్రీశ్రీని ఆహ్వానిస్తున్నారంటే శ్రీశ్రీ పూర్తిగా వ్యవస్థలో జీర్ణమైపోయినట్లే. అలా ఆయన కవిత్వం ఇక నిర్వర్తించబోయే ప్రయోజనం కూడా ఉండదని గమనించాల్సి ఉంటుంది.కాగా, శ్రీశ్రీ రాజకీయాలతో మమేకం చెందుతున్నవారంతా ప్రభుత్వాలు ఆయనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన చెందడం అనూహ్యమైన పరిణామంగా భావించవచ్చు. శ్రీశ్రీ రాజకీయ విశ్వాసాలతో పూర్తిగా విభేదించే వారు ఇప్పుడు శ్రీశ్రీని అందరికన్నా ఎక్కువగా కీర్తిస్తున్నారు. ఏమైనా, శ్రీశ్రీ ఇక ఎంత మాత్రం పీడితుల కవిగా మిగిలే అవకాశం లేదు. సాహిత్యంలో ఆయన అగ్రస్థానంలో మాత్రం ఉంటాడు.