నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ-61.. లాంచింగ్ ఎప్పుడంటే ?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి ఆదివారం ఉదయం 5 గంటల 59 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ-61 నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో అంతా రెడీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే శనివారం ఉదయం 7 గంటల 59 నిమిషాలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. పీఎస్ఎల్వీ సీ61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్-1బీ) అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.
ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడనుంది. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు, నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. అంతే కాకుండా ఇందులో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ పగలు, రాత్రి వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా భూమి ఉపరితలం నుంచి అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను సేకరించనుంది.

ఇప్పటి దాకా వున్న ఈఓఎస్ ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్ను అమర్చి పంపిస్తున్నారు. భారత సైన్యానికి కావాల్సిన పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్ర కార్యకలాపాలను కూడా అత్యధిక రిజల్యూషన్తో ఛాయాచిత్రాలు తీయడమే కాకుండా సరిహద్దుల్లో శత్రు సైన్యాల కదలికల గురించి సమాచారాన్నీ అందిస్తుందని చెబుతున్నారు.
ఈఓఎస్ ఉపగ్రహాల సిరీస్లో ఇది తొమ్మిదో ఉపగ్రహం కాగా ఇస్రో చైర్మన్ వి.నారాయణన్, శాస్త్రవేత్తలు ఇప్పటికే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ61 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నారాయణన్, శాస్త్రవేత్తలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో భారత సైన్యానికి అన్ని విధాలుగా ఈఓఎస్ సిరీస్ ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. నిరంతరం అంతరిక్షం నుంచి ఉగ్ర కార్యకలాపాలు, స్థావరాలని ఉపగ్రహాలు గుర్తిస్తున్నాయి. భవిష్యత్తులో ఇది కూడా మరింతగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ ప్రయోగం నేపథ్యంలో షార్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications