జాబిల్లిపై జయకేతనం- నిత్య నూతనం
Chandrayaan 3: సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు.. కోట్లాదిమంది నిరీక్షణ ఫలించింది. భారత్ నింగిని జయించింది. అంతరిక్షంలో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. చందమామ మన చేతికి అందింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర విజయ తీరాలకు చేరింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగు మోపింది. అత్యంత సంక్లిష్టం అనుకున్న ప్రయోగం అత్యద్భుతంగా విజయవంతమైన సందర్భం అది.
ఈ సువర్ణాధ్యాయం కోసం దేశం మొత్తం ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన క్షణాలు సఫలమైన రోజు ఇది. గతంలో ఎదురైన చేదు సంఘటనలు అధిగమించి.. మరీ చందమామను చేతికి అందుకుంది ఇస్రో. 2023న ఇదే ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 6:04 నిమిషాలకు చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయినట్లు అప్పటి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించగానే.. దేశం మొత్తం కూడా ఆనందడోలికల్లో తేలిపోయింది. జయజయధ్వానాలు మిన్నంటాయి. శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఇదే చంద్రయాన్ విషయంలో ఇస్రో గతంలో విఫలమైన విషయం తెలిసిందే. నిజానికి 2019లోనే ఈ ఘనతను సాధించాల్సి ఉంది. అప్పట్లో ప్రయోగించిన చంద్రయాన్ 2 గమ్యానికి చేరుకోలేకపోయింది. ఆ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన ఇది చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కావాల్సి ఉన్నప్పటికీ.. అది సాధ్యపడలేదు. చివరి నిమిషంలో గతి తప్పింది. చంద్రుడిపై క్రాష్ ల్యాండింగ్కు గురైంది. కోట్లాదిమంది భారతీయుల హృదయాలను ముక్కలు చేసింది.
సరిగ్గా నాలుగేళ్ల వ్యవధిలో నాటి పెను విషాదాన్ని విజయంగా మలచుకోగలిగింది ఇస్రో. అప్పటి అపజయాన్ని విజయానికి మెట్లుగా స్వీకరించింది. ఒక్కో మెట్టును అధిగమిస్తూ ఏకంగా చంద్రమండలానికే నిచ్చెన వేసింది. విజయం అంటే ఇదీ తొడగొట్టి నిరూపించినట్టయింది ఇస్రో. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అతి కొద్ది దేశాల సరసన నిలిచింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ లో పేలోడ్ గా పంపించిన ప్రజ్ఞాన్ రోవర్ అతి కీలక డేటాను అందించింది అప్పట్లో.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా ఆవిర్భవించింది భారత్. ఇంతకుముందు- రష్యా (సోవియట్ యూనియన్), అమెరికా, చైనా ఈ ఘనతను సాధించాయి. దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన తొలి దేశం మాత్రం భారతే. విక్రమ్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని శివశక్తి పాయింట్ గా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అలాగే.. ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీని నేషనల్ స్పేస్ డే గా జరుపుకోవాలని దేశ ప్రజలను కోరారు.
అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటోంది యావత్ దేశం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్లో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
చంద్రయాన్ మిషన్ను తయారు చేయడంలో మొత్తం 12 సంస్థలు/యూనిట్లు భాగస్వామ్యం అయ్యాయి. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్- బెంగళూరు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్- తిరువనంతపురం, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్- తిరువనంతపురం, బెంగళూరు, ఇస్రో శాటిలైట్ ట్రాకింగ్ సెంటర్- బెంగళూరు, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్- అహ్మదాబాద్, ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్- బెంగళూరు కంపెనీలు ఇందులో భాగస్వామ్యం వహించాయి.
వీటితో పాటు ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్- తిరువనంతపురం, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్- మహేంద్రగిరి, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్- శ్రీహరికోట, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్- హైదరాబాద్, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, స్పేస్ ఫిజిక్స్ లాబొరేటరీ మేకింగ్ ఆఫ్ చంద్రయాన్ 3లో పాల్గొన్నాయి. ఇవి కాకుండా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, స్వీడిష్ స్పేస్ కార్పొరేషన్.. వంటి విదేశీ అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రోకు తమవంతు సహకారాన్ని అందించాయి.














Click it and Unblock the Notifications