భూమిపై అత్యంత పెద్ద జీవి.. ఈ అడవి మొత్తం ఒక్కటే చెట్టు!
మనం చూసే ప్రకృతిలో ఎన్నో వింతలు, వింత జీవులు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద జీవి అంటే అందరికీ వెంటనే 'నీలి తిమింగలం' గురుతోస్తుంది. కానీ, అమెరికాలోని యూటా రాష్ట్రంలో ఉన్న ఒక అడవి మొత్తం కలిసి ఒకే ఒక్క జీవిగా బతుకుతోందని తెలిస్తే ఎవరైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! దాదాపు 100 ఎకరాలకు పైగా విస్తరించి, వేలాది చెట్లతో కలకలలాడే ఒక పెద్ద అడవి అంతా నేల లోపల ఉన్న ఒకే ఒక్క వేరు వ్యవస్థతో ముడిపడి ఉంది. శాస్త్రవేత్తలు ఈ విచిత్రమైన వృక్ష సామ్రాజ్యానికి 'పాండో' అని పేరు పెట్టారు.
గాలికి వణికే మహా వృక్షం.. 'ట్రెంబ్లింగ్ జెయింట్'
ల్యాటిన్ భాషలో 'పాండో' అంటే "నేను విస్తరిస్తున్నాను" అని అర్థం. ఇక్కడ విత్తనాల ద్వారా కొత్త చెట్లు మొలకెత్తవు; నేల లోపల ఉన్న ప్రధాన వేరు నుంచే కొత్త కొత్త కాండాలు పైకి వస్తాయి. బయటకు ఇవి వేర్వేరు చెట్లా కనిపించినా, జన్యుపరంగా అంతా ఒకే జీవి. ఈ అడవిలోని ఆకులన్నీ చిన్నపాటి గాలికే విచిత్రంగా పటపటలాడుతూ ఊగుతాయి. వేలాది ఆకులు ఒకేసారి అలా కదులుతుంటే వచ్చే శబ్దం ఏదో సంగీతంలా వినిపిస్తుంది. అందుకే దీనికి 'ట్రెంబ్లింగ్ జెయింట్' అని ముద్దుపేరు పెట్టారు.

వేల ఏళ్ల నాటి ప్రాచీన సామ్రాజ్యం
ఈ వింత జీవి వయసు ఎంత ఉందో కచ్చితంగా చెప్పడం శాస్త్రవేత్తలకు కూడా పెద్ద సవాలుగానే మారింది. కొందరు దీని వయసు దాదాపు 14,000 సంవత్సరాలు అని అంచనా వేస్తుంటే, మరికొందరు సైంటిస్టులు ఇది 80,000 ఏళ్ల క్రితం నాటిదని భావిస్తున్నారు. మానవ నాగరికతలు పుట్టకముందు నుంచే ఈ మహా జీవి భూమిపై ఉనికిలో ఉందనడంలో సందేహం లేదు. సాధారణంగా మనం అడవిలోకి వెళ్తే ఎన్నో రకాల చెట్లు కనిపిస్తాయి. కానీ పాండో అడవిలోకి అడుగుపెడితే, మనం తలుపు తొక్కింది ఒకే ఒక్క ప్రాచీన జీవి ఇంట్లోకి అని అర్థమవుతుంది!
ఒక్క చెట్టు.. ఒక పెద్ద జీవావరణం
పాండో కేవలం ఒక వింత వృక్షం మాత్రమే కాదు, ఎన్నో జీవులకు ఇల్లు. ఈ అడవి వ్యాప్తంగా రకరకాల పక్షులు, అడవి టర్కీలు, కీటకాలు, ఎర్ర నక్కలు వంటి అనేక జంతువులు నివాసం ఉంటున్నాయి. కాలాలతో పాటు ఈ అడవి రూపురేఖలు మారిపోతాయి. ముఖ్యంగా సెప్టెంబరు నెల మధ్యలో ఆకులన్నీ బంగారు వర్ణంలోకి మారి పర్యాటకులకు కంటిపాపలా దర్శనమిస్తాయి. ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
భారీ జీవికి వచ్చిపడిన ముప్పు
వేల ఏళ్లుగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడిన ఈ 'ట్రెంబ్లింగ్ జెయింట్' ప్రస్తుతం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన కరువు పరిస్థితులు దీని మనుగడను దెబ్బతీస్తున్నాయి. దీనికితోడు ఆ ప్రాంతంలో తిరిగే జింకలు, ఇతర అడవి జంతువులు నేల నుంచి కొత్తగా వచ్చే లేత మొక్కలను తినేస్తున్నాయి. దాంతో పాతబడిన కాండాలు చనిపోతున్నా, వాటి స్థానంలో కొత్త చెట్లు ఎదగలేకపోతున్నాయి. ప్రస్తుతం పర్యావరణ వేత్తలు ప్రత్యేక కంచెలు ఏర్పాటు చేసి ఈ మహా జీవిని కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు.














Click it and Unblock the Notifications