NASA బంపరాఫర్: ఒక్క ఐడియా జీవితాన్నే మారుస్తుంది..!!
NASA Prize Money:ప్రముఖ అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా) అంతరిక్ష ఔత్సాహికులకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. చంద్రుడి పై పరిశోధనలు చేసేందుకు గాను చంద్రుడి దక్షిణ ధృవం వద్దకు వెళ్లే వ్యోమగాములు ఒకవేళ చిక్కుకుంటే వారిని సురక్షితంగా చంద్రుడి నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు తీసుకువచ్చేలా మంచి ఆలోచన, అమలు అయ్యే కార్యాచరణతో రావాలని ప్రకటించింది. ఆ ఆలోచన నాసాకు నచ్చినట్లయితే ఐడియా ఇచ్చిన వారికి 20వేల డాలర్లు ప్రైజ్ మనీ ఉంటుందని ప్రకటించింది.
చంద్రుడిపై పరిశోధనల కోసం వెళ్లిన వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోతే వారిని రక్షించగలగాలి.ఇక ఈ సమస్యను పరిష్కరించే మార్గం సులభతరంగా ఉండటంతో పాటు ఆచరణలో పెట్టగలిగేలా ఉండాలనే షరతు విధించింది.2026వ సంవత్సరం తొలిభాగంలో ఆర్టిమిస్ మిషన్ను ప్రారంభించాలని నాసా భావిస్తోంది. ఇందులో భాగంగా వ్యోమగాములను (Astronauts) చంద్రడి దక్షిణ ధృవం వద్దకు పంపాలని నిర్ణయించింది. ఇదే ప్రాంతం ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది.

చంద్రుడి దక్షిణ ధృవం వద్దకే ఎందుకు..?
వ్యోమగాములను చంద్రుడి దక్షిణ ధృవం వద్దకే పంపాలనే నాసా నిర్ణయం వెనుక బలమైన కారణం ఉంది. దక్షిణ ధృవం వద్ద అయితే నీటి వనరులు,మంచు లభిస్తాయని వెల్లడించింది. ఇక్కడి నుంచి తాగునీరుతో పాటు ఆక్సిజన్,ఇంధనాన్ని వెలికితీయొచ్చని అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు నాసా పేర్కొంది. అయితే ఈ ప్రాంతంకు చేరకోవడం సవాలుతో కూడుకున్న పని. చంద్రుడిపై వాతావరణం -203 డిగ్రీల సెల్సియస్ నుంచి 54 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి,ఎత్తైన కొండలు, రాళ్లు, లోయలు ఉంటాయి. పరిశోధనల నిమిత్తం దక్షిణ ధృవం నుంచి బయలు దేరి వెళుతున్న సమయంలో పొరపాటున ఒక వ్యోమగామి గాయపడితే అతను లేదా ఆమె అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. అక్కడి నుంచి తిరిగి వారిని సురక్షిత ప్రాంతానికి అంటే తిరిగి దక్షిణ ధృవం వద్దకు తీసుకురావడం సవాలుగా మారింది.
రెస్క్యూ వ్యవస్థకు కావాల్సినవి:
ఇక రెస్క్యూ వ్యవస్థ అమలు చాలా సులభతరంగా జరిగిపోయేలా ఉండాలి. మెషినరీ చాలా తక్కువ బరువు కలిగి ఉండటంతో పాటు చిక్కుకుపోయిన వ్యోమగాముల్లో ఒకసారి ఒక్కో వ్యోమగామిని మాత్రమే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించగలిగేలా ఉండాలి. ఇందుకోసం లూనార్ రోవర్ మీద ఆధారపడకూడదు. చంద్రుడి పై ఉన్న కఠినమైన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రెస్క్యూ వాహనం తయారు చేయాల్సి ఉంటుందని నాసా పేర్కొంది.
ఆర్టిమిస్ (Artemis) మిషన్ టైమ్లైన్:
చంద్రుడిపై శాశ్వతంగా మానవుడి మనుగడ కొనసాగేలా చర్యలు తీసుకుంటోంది నాసా. ఇందులో భాగంగానే తొలి అడుగుగా ఆర్టిమిస్ మిషన్ను ప్రయోగించి అక్కడ సాధ్యసాధ్యాలపై స్టడీ చేయనుంది. ముందుగా ఆర్టిమిస్-IIIని 2026 చంద్రుడి వద్దకు పంపుతుంది. ఇందులో వ్యోమగాములు ఉంటారు. ఆ తర్వాత ఆర్టిమిస్ IVను 2028లో చంద్రుడిపైకి పంపనుంది. అప్పటికి కొత్త ల్యాండింగ్ టెక్నాలజీని పరిచయం చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇక చివరిగా 2030లో ఆర్టిమిస్ Vను చంద్రుడిపైకి పంపుతుంది. ఈ ప్రయోగం ద్వారా లూనార్ టెరెయిన్ వెహికల్ను పరిచయం చేస్తుంది. ఈ మూడు మిషన్లు చంద్రుడిపై పరిశోధనలు చేయడంలో ఉపయోగపడుతాయి. అదే సమయంలో చాలా సవాలుతో కూడుకున్న పని. ఏది ఏమైనప్పటికీ వ్యోమగాముల సేఫ్టీనే తమ తొలి ప్రాధాన్యత అని నాసా వెల్లడించింది.












Click it and Unblock the Notifications