బంగ్లాకు ఐసీసీ 24 గంటల అల్టిమేటం..! లేకపోతే వారికి ఛాన్స్-పాక్ అనూహ్య ఆఫర్..!
బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలపై భారత్ లో నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఈ ఏడాది ఐపీఎల్ నుంచి బహిష్కరించడం, దానికి ప్రతిగా భారత్ లో టీ20 వరల్డ్ కప్ ఆడబోమని బంగ్లా భీష్మించుకుని కూర్చోవడం తెలిసిందే. అయితే ఈ వివాదంపై ఇప్పటికే ఐసీసీ బంగ్లాదేశ్ బోర్డుతో చర్చలు జరుపుతున్నా బీసీబీ మొండిపట్టు వీడటం లేదు. ఇలాగైతే బంగ్లా స్ధానంలో మరో జట్టుకు అవకాశం ఇచ్చేస్తామన్న ఐసీసీ హెచ్చరికలు కూడా ఆ దేశంపై పనిచేయలేదు.
ఈ నేపథ్యంలో ఇవాళ తాడోపేడో తేల్చేసేందుకు ఐసీసీ కమిటీ మరోమారు సమావేశమైంది. ఇందులో భారత్ లో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడేందుకు నిరాకరిస్తే వారి స్ధానంలో మరో జట్టుకు అవకాశం కల్పిస్తామని ఐసీసీ మళ్లీ తేల్చిచెప్పేసింది. అంతే కాదు దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి తమ నిర్ణయం చెప్పేందుకు కేవలం 24 గంటల గడువు ఇచ్చింది. ఆ లోపు ఏ నిర్ణయం చెప్పకపోతే మాత్రం బంగ్లాదేశ్ స్ధానంలో మరో జట్టు ఈసారి టీ20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం పొందుతుందని తెలిపింది.

ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే తాము భారత్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు బంగ్లాదేశ్ చెబుతోంది. తమ ఆటగాళ్లకు భారత్ లో భద్రతా సమస్యలు ఉంటాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత్ వెళ్లకూడదన్న నిర్ణయంపై మరోసారి ప్రభుత్వంపై మాట్లాడి తుది క్లారిటీ ఇచ్చేందుకు ఐసీసీ 24 గంటల గడువు ఇచ్చింది. ఆ లోపు తేల్చకపోతే మాత్రం టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించడంలో విఫలమైన స్కాట్లండ్ కు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు భద్రతా సమస్యల కారణంగా భారత్ లో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను ఆడటానికి నిరాకరించిన బంగ్లాదేశ్ వైఖరిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమర్థించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తామని ఐసీసీ లేఖ కూడా పంపింది. వాస్తవానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తన మ్యాచ్లను భారత్ తో పాటు టోర్నీ సహ ఆతిథ్యదేశమైన శ్రీలంకకు మార్చాలని కోరింది. కానీ శ్రీలంక కూడా ఇందుకు అంగీకరించకపోవడంతో ఐసీసీ కూడా ఏమీ చేయలేని పరిస్ధితి. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్ లకు ఆతిధ్యమిస్తామంటూ పాకిస్తాన్ ఆఫర్ చేస్తోంది. రేపటిలోగా బంగ్లాదేశ్ చెప్పే సమాధానం ఆధారంగా ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది.












Click it and Unblock the Notifications