ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్!
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్ కు అర్హత సాధించడంలో విఫలం కావడమే కాకుండా పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఓటమికి బాధ్యులుగా చేస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ఆటగాళ్లకు తలా 50 లక్షల రూపాయల భారీ జరిమానా విధించినట్లు సమాచారం. బోర్డు తీసుకున్న ఈ వింత నిర్ణయంపై అటు ఫ్యాన్స్, ఇటు మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పీసీబీకి అహ్మద్ షెహజాద్ బంపరాఫర్
చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న పాక్ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ ఈ జరిమానా అంశంపై ఘాటుగా స్పందించాడు. 'హార్నా మనా హై' అనే చర్చా కార్యక్రమంలో అహ్మద్ షెహజాద్ మాట్లాడుతూ.. ఆటగాళ్లందరి తరపున ఆ జరిమానాను తానే చెల్లిస్తానని ఆఫర్ ఇచ్చాడు. అయితే అందుకోసం ఆయన ఓ షరతును కూడా విధించాడు. "ఆ 50 లక్షల జరిమానా నేనే కడతాను. దేవుడి సాక్షిగా చెబుతున్నాను.. ఒకవేళ ఈ జరిమానా కట్టడం వల్ల దేశం బాగుపడినా లేదా పాకిస్థాన్ క్రికెట్ మళ్లీ గాడిలో పడినా, ఆటగాళ్లందరి తరపున ఆ డబ్బు నేను ఇచ్చేస్తాను. ఎంతమందికి జరిమానా విధించినా సరే, ఆ మొత్తం నేనే భరిస్తాను" అని అహ్మద్ షెహజాద్ వ్యాఖ్యానించాడు.

పీసీబీపై విమర్శల జడివాన
జరిమానాలు విధించినంత మాత్రాన క్రికెట్ మెరుగుపడుతుందా? అని అహ్మద్ షెహజాద్ బోర్డును ప్రశ్నించారు. "కేవలం ఓడిపోయినందుకు జరిమానా విధించడం ఏంటి? ఇది ఆ ఆటగాళ్ల ప్రస్తుత సామర్థ్యానికి నిదర్శనం. తక్కువ సామర్థ్యం ఉన్నందుకు మీరు పదే పదే జరిమానాలు విధిస్తూనే ఉంటారా?" అని షెహజాద్ ఎద్దేవా చేశాడు. ఎవరైనా కావాలని సరిగ్గా ఆడకపోయినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా లేదా టీమ్ ప్లాన్ పాటించకపోయినా జరిమానా విధించడంలో అర్థం ఉందని, కానీ కేవలం ఫలితం సరిగ్గా రాలేదని ఇలాంటి చర్యలు తీసుకోవడం హాస్యాస్పదమని అన్నాడు. క్రికెట్ను ఎలా సరిదిద్దాలో ఇప్పటికే తాము అనేక సూచనలు చేశామని, అవేవీ పట్టించుకోకుండా ఇలాంటి చిన్నపాటి పనులతో కాలక్షేపం చేయడం వల్ల ప్రయోజనం లేదని షెహజాద్ మండిపడ్డాడు.
పాకిస్థాన్ క్రికెట్లో ప్రస్తుతం నెలకొన్న అస్థిరతకు ఈ జరిమానా ఉదంతం అద్దం పడుతోంది. ఆటగాళ్లలో నైతిక స్థైర్యాన్ని పెంచాల్సింది పోయి, ఇలా ఆర్థికంగా శిక్షించడం వల్ల జట్టు మరింత కుంగిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications