Asia cup 2023: భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం ముప్పు- అయినా బేఫికర్
కొలంబో: శ్రీలంక వేదికగా కొనసాగుతున్న ఆసియా కప్ 2023 టోర్నమెంట్.. సూపర్ 4 రసవత్తరంగా మొదలైంది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ను మట్టి కరిపించింది. లాహోర్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత ఫీల్డింగ్ చేసిన పాకిస్తాన్.. ప్రత్యర్థిని 193 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఆ లక్ష్యాన్ని 39.3 ఓవర్లల్లో మూడు వికెట్ల నష్టానికి ఛేదించింది.
ఈ విజయంతో ప్రస్తుతం పాకిస్తాన్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రెండు పాయింట్ల ఆ జట్టు ఖాతాలో పడ్డాయి. శనివారం రెండో మ్యాచ్ షెడ్యూల్ అయింది. కొలంబో ఈ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. బంగ్లాదేశ్- శ్రీలంక జట్లు తలపడబోతోన్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

ఆదివారం.. అసలు సిసలు గేమ్ మొదలవుతుంది. భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగనుంది. లీగ్ దశలో ఈ రెండు ఢీ కొట్టిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 266 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఇన్నింగ్ ఆరంభం అయ్యే సమయానికి భారీ వర్షం కురవడం వల్ల ఒక్క బంతీ పడకుండా మ్యాచ్ రద్దయింది.
ఆసియా కప్ టోర్నమెంట్ మొత్తానికీ అత్యంత ఆసక్తి కలిగించే మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచే. అలాంటిది లీగ్ మ్యాచ్ రద్దు కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది. అందుకే సూపర్ 4 దశలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు రిజర్వ్ డేను ఏర్పాటు చేసింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఫైనల్ కాకుండా రిజర్వ్ డే ఉన్న ఏకైక మ్యాచ్ ఇదే.
కొలంబోలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ముందు జాగ్రత్త చర్యగా రిజర్వ్ డేను ప్రకటించింది ఏసీసీ. ఆదివారం జరిగే భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. 90 శాతం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ కేంద్రం తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ డేను కల్పించింది.












Click it and Unblock the Notifications