మాజీ ఛాంప్కు అవమానం- అట్టడుగు స్థానానికి దిగజారిన ఆసీస్
న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో అద్భుతం. పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఛాంపియన్ ఇంగ్లాండ్ మట్టికరిచింది. ఏకంగా 69 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఈ ఒక్క విజయం- ఆఫ్ఘనిస్తాన్ను పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేర్చింది. ఇంగ్లాండ్తో సమానంగా నిలిపింది.
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘన్.. 284 పరుగులు చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్-80, ఇక్రమ్ అలికల్- 58 హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివర్లో- లోయర్ ఆర్డర్ బ్యాటర్ ముజీబుర్ రెహ్మాన్ మెరుపు బ్యాటింగ్.. జట్టు భారీ స్కోరుకు దోహదపడింది.

ఈ స్కోర్ను అందుకోలేకపోయింది ఇంగ్లాండ్. 215 పరుగులకు కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ ఒక్కడే టాప్ స్కోరర్. 61 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్తో 6 పరుగులు చేశాడు. ఓపెనర్ డేవిడ్ మలన్ 32 పరుగులు చేశాడంతే. ఏ ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు.
ఈ విజయంతో పాయింట్ల పట్టిక మొత్తం తారుమారయింది. మ్యాచ్ ముందు వరకు అట్టడుగున అంటే 10 స్థానంలో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్.. మ్యాచ్ తరువాత ఒక్కసారిగా ఆరో స్థానానికి ఎగబాకింది. భారీ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించడం వల్ల ఆ జట్టు నెట్ రన్రేట్ మెరుగుపడింది. తన ఖాతాలో రెండు పాయింట్లను వేసుకోగలిగింది. ప్రస్తుతం ఆఫ్ఘన్ నెట్ రన్ రేట్ -0.652.
ఆస్ట్రేలియా పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఆడిన రెండు మ్యాచ్లల్లోనూ దారుణంగా ఓడిపోయిందీ మాజీ ఛాంప్. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి దిగజారింది. ఇప్పటివరకు రెండు మ్యాచ్లను ఆడిన ఆసీస్.. ఇంకా తన ఖాతాను కూడా తెరవలేదు. ఆడిన రెండింట్లోనూ ఓడింది. భారత్, దక్షిణాఫ్రికా చేతుల్లో మట్టికరిచింది.
ఆసీస్ ఖాతాలో ఉన్న పాయింట్లు.. జీరో. నెట్ రన్రేట్ -1.846. ఈ సాయంత్రం తన మూడో మ్యాచ్ ఆడబోతోంది ఆసీస్. శ్రీలంకతో తలపడనుంది. లక్నోలోని ఏక్నా స్టేడియం దీనికి వేదిక. ఈ రెండు జట్లకూ ఇది మూడో మ్యాచ్. ఈ రెండు కూడా ఇంకా గెలుపు రుచి చూడలేదు. ఆడిన రెండింట్లోనూ ఓడింది లంక. ఏ జట్టు గెలిచినా తొలి విజయమే అవుతుంది వాటికి.












Click it and Unblock the Notifications