క్రిస్ గేల్ రిటర్న్స్..: ఫైనల్స్ రచ్చ రచ్చే- కోహ్లీకి హితోపదేశం
IPL 2025 final: ఐపీఎల్ 2025లో బిగ్ డే.. నేడే ఫైనల్స్. ఐపీఎల్ లో ఓ కొత్త ఛాంపియన్ ఆవిర్భవించబోయేదీ నేడే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీ కొట్టబోతోంది పంజాబ్ కింగ్స్. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక.
ఏ జట్టు గెలిచినా.. తొలిసారి కప్ ను ముద్దాడుతుంది. ఈ రెండింట్లో ఏ జట్టు కూడా ఇప్పటివరకు ఐపీఎల్ కప్ కొట్టలేదు. 2022 తరువాత మళ్లీ అలాంటి సీన్.. ఈ రాత్రికి రిపీట్ కాబోతోంది. ఆ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త విజేతను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది 18వ ఐపీఎల్ సీజన్.

ఇప్పటివరకు అత్యధికసార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. అయిదేసిసార్లు చొప్పున కప్ గెలిచాయి. ఈ రెండింటికే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ అనే పేరు ఉంది. ఈ సారి ఈ రెండూ కూడా ఫైనల్స్ చేరలేకపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్.. లీగ్స్ దశలోనే ఇంటిముఖం పట్టగా.. ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ లో ఓడిపోయింది.
ఈ రెండింటి తరువాత కోల్ కత నైట్ రైడర్స్ మూడుసార్లు విజేతగా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, దక్కన్ ఛార్జర్స్ ఒక్కోసారి కప్ అందుకున్నాయి. నేడు- రాయల్ ఛాలెంజర్స్ లేదా పంజాబ్ కింగ్స్.. ఈ జాబితాలో చేరనున్నాయి.
ఈ ఫైనల్స్ పోరును చూడటానికి వెస్టిండీస్, దక్షిణాఫ్రికా లెజెండరీ ప్లేయర్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ స్టేడియానికి రానున్నారు. వీరిద్దరూ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే. ఏబీడీ ఇప్పటికే అహ్మదాబాద్ కు చేరుకున్నాడు కూడా. ఈ సాయంత్రం 6 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియానికి వెళ్లనున్నాడు.
ఫైనల్ మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీకి ఏబీ డివిలియర్స్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. మ్యాచ్ గురించి ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దని, కుటుంబంతో కలిసి సరదాగా బయట తిరిగి రావాలని చెప్పాడు. మ్యాచ్ ముందు సమయాన్ని ఎంజాయ్ చేయాలని అన్నాడు.
ముఖంపై చిరునవ్వును ఎటువంటి పరిస్థితుల్లోనూ చెదరనివ్వొద్దని ఏబీడీ సూచించాడు. కోహ్లీని ఎప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా చూడదలచుకున్నానని వ్యాఖ్యానించాడు. ఆర్సీబీ మ్యాచ్ చూస్తూ తాను స్టేడియంలోనే ఉంటానని, ట్రోఫీని ఇంటికి తీసుకురావాలని కోరాడు. మ్యాచ్ లో ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాలని చెప్పాడు.
క్రిస్ గేల్.. కూడా అహ్మదాబాద్ చేరుకోనున్నాడు. ప్రస్తుతం ఆన్ ది వేలో ఉన్నానంటూ కొన్ని ఫొటోలను అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఐపీఎల్ లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్.. రెండింటికీ ఆడాడు క్రిస్ గేల్. తాను ఆడిన మాజీ జట్ల మధ్య జరిగే ఫైనల్ కు హాజరవుతున్నానని, ఓ గొప్ప గేమ్ ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని వదలదలచుకోలేదని చెప్పాడు.












Click it and Unblock the Notifications