Madhya pradesh election 2023: ఐపీఎల్ టీమ్ తీసుకొస్తాం.. మేనిఫెస్టోలో కాంగ్రెస్..!
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ మంగళవారం రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) జట్టు ఉండేలా చూస్తామని ప్రకటించారు. దేశంలో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ కు ఐపీఎల్ జట్లు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్, గుజరాత్ ఐపీఎల్ జట్లు రెండేళ్ల క్రితమే వచ్చాయి. ఏపీ సీఎం జగన్ కూడా ఏపీకి ఐపీఎల్ జట్టు ఉండాలని భావిస్తున్నారు.
ఎంపీలోని ప్రజలందరికీ రూ. 25 లక్షల ఆరోగ్య బీమా, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ 106 పేజీలతో మేనిఫెస్టో ప్రకటించింది. ఇందులో రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు హామీలతో 59 వాగ్దానాలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యాస్ సిలిండర్ను కేవలం రూ.500కే అందజేస్తామని పేర్కొంది. దీంతోపాటు రూ.2 లక్షల మేర రైతు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.1500 భృతి చెల్లిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించింది.

రూ.10 లక్షల మేర ప్రమాద బీమా కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని పేర్కొంది.పాఠశాల విద్యను పూర్తి ఉచితంగా అందించడంతోపాటు, నిరుద్యోగ యువతకు వాళ్ల అర్హత ఆధారంగా నెలకు రూ.1,500 నుంచి రూ.3 వేల చొప్పున రెండేళ్లపాటు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది.
మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు, గ్రామీణ నిరాశ్రయులైన మహిళలకు గృహాలు, మెట్రోపాలిటన్ బస్సు సర్వీసుల్లో ఉచిత రవాణా పేర్కొంది. స్టార్టప్ల కోసం 3 శాతం వడ్డీ రేటుతో మహిళలకు ₹25 లక్షల వరకు రుణాలు అందిస్తామని హామీ ఇచ్చింది. 230 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్నాయి. అదే రోజు మధ్యప్రదేశ్ తో పాటు రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరాం, తెలంగాణ ఫలితాలు వస్తాయి.












Click it and Unblock the Notifications