ముంబై ఇండియన్స్ స్టార్ ఫాదర్ పొలిటికల్ గ్రాండ్ ఎంట్రీ
Pranav Pandey: ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ ప్లేయర్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ పాండే- రాజకీయ అరంగేట్రం చేశారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో బిహార్లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్) పార్టీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.
కొద్దిసేపటి కిందటే పాట్నాలో గల జేడీయూ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు సంజయ్ ఝా, ఇతర నాయకుల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సంజయ్ ఝా చేతుల మీదుగా జేడీయూ ప్రాథమిక సభ్యత్వ కార్డును అందుకున్నారు. కండువాను కప్పుకొన్నారు. ఆయన రాకను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వాగతించారు.

ప్రణవ్ పాండే వృత్తిరీత్యా బిల్డర్. భూమిహర్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన భార్య, ఇషాన్ కిషన్ తల్లి సుచిత్ర సింగ్ డాక్టర్. నవడాలో ఓ క్లినిక్ను నిర్వహిస్తోన్నారు. స్థానికంగా ప్రణవ్ పాండే కుటుంబానికి మంచి పేరు ఉంది. అలాగే- ఇషాన్ కిషన్ తల్లిదండ్రులుగా మంచి గుర్తింపూ ఉంది.
ప్రణవ్ పాండే భూమిహర్ బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలంగా ఉన్న మగధ్ రీజియన్లో జేడీయూ మరింత బలపడుతుందనే అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఆ హామీతోనే ఆయనను పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు.
అదే జరిగితే- నవడా లేదా ఒబ్రా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి జేడీయూ అభ్యర్థిగా ప్రణవ్ పాండే ఎన్నికల్లో పోటీ చేయడం లాంఛనప్రాయమే అవుతుంది. ప్రణవ్ పాండే చేరికపై సంజయ్ ఝా మాట్లాడారు. నితీష్ కుమార్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై తమ పార్టీలో చేరారని, ఆయన రాక వల్ల మగధ్ రీజియన్లో పార్టీ బలపడుతుందని అన్నారు.
కాగా- ప్రస్తుతం ఇషాన్ కిషన్ ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఇండియా- ఏ తరఫున ఆ దేశ జట్టుతో మ్యాచ్లను ఆడనున్నారు. ఓ టెస్ట్, ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనుందీ టీమ్. భారత్తో అయిదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానున్నందున వామప్గా ఈ రెండింటినీ ఆడబోతోంది ఆస్ట్రేలియా.












Click it and Unblock the Notifications