టాపర్ రోహిత్ శర్మ: అతని ఖాతాలో అరుదైన రికార్డ్
Rohit Sharma: హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరుగుతున్న అయిదో/చివరి టెస్ట్ మ్యాచ్లో భారత్ పట్టు బిగించింది. రెండో రోజూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్లో భారీ స్కోర్ మీద కన్నేసింది. మరోసారి జట్టు స్కోరు 400 పరుగుల మార్క్ను దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్లో ఇంగ్లాండ్ కుప్పకూలిన విషయం తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ ధాటికి బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కకావికలమైంది. ఓపెనర్ జాక్ క్రాలీ తప్ప మరెవరూ క్రీజ్లో కుదురుకోలేకపోయారు. 79 పరుగులు చేసిన క్రాలీ ఒక్కడే టాప్ స్కోరర్. కుల్దీప్ యాదవ్-5, రవిచంద్రన్ అశ్విన్-4 వికెట్లు పడగొట్టారు.

బెన్ డకెట్- 27, ఒల్లె పోప్- 11, జో రూట్- 26, జానీ బెయిర్ స్టో- 29, బెన్ స్టోక్స్- 0, బెన్ ఫోక్స్- 24, టామ్ హార్ట్లే-6, జేమ్స్ అండర్సన్- 0, మార్క్వుడ్-0, షోయబ్ బషీర్- 11 పరుగులు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్ ఆరంభించిన టీమిండియా ధాటిగా ఆడుతోంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్కు పూర్తి భిన్నంగా రెచ్చిపోతున్నారు బ్యాటర్లు.
ఈ క్రమంలో రెండో రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 264 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. లంచ్ వరకూ టీమిండియాదే పూర్తి ఆధిపత్యం. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇద్దరూ సెంచరీలు బాదారు.
లంచ్ తరువాత మాత్రం ఒకరి వెంట ఒకరు అవుట్ అయ్యారు. పెవిలియన్ దారి పట్టారు. తొలుత 103 పరుగులు చేసిన రోహిత్ శర్మ లంచ్ తరువాత ఎక్కువ సేపు క్రీజ్లో ఉండలేకపోయాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 110 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ను జేమ్స్ అండర్సన్ బలి తీసుకున్నాడు.
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఓపెనర్గా రికార్డు నెలకొల్పాడు రోహిత్ శర్మ. ఓపెనర్గా అతని ఖాతాలో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి. మొత్తం మీద 12వది. ఇతర జట్ల ఓపెనర్లు దిముత్ కరుణరత్నె-8, టామ్ లాథమ్- 5, డేవిడ్ వార్నర్-5, ఉస్మాన్ ఖవాజా- 5 సెంచరీలు కొట్టారు.












Click it and Unblock the Notifications