World Cup 2023: పాక్ ఆశలు పెంచిన కివీస్ - సెమీస్ చేరేదెవరు, ఆ మ్యాచ్ తో క్లారిటీ..!!
ప్రపంచ కప్ సమరంలో లెక్కలు మారిపోతున్నాయి. బలమైన జట్టుగా టోర్నీలో అడుగుపెట్టి..అంచనాలను నిలబెట్టుకుంటూ వరుసగా నాలుగు విజయాలతో గ్యారెంటీ సెమీ ఫైనలిస్టుగా కనిపించిన న్యూజీలాండ్ .. ఇప్పుడు నాలుగో స్థానం కోసం పోరాడాల్సి వచ్చింది. సౌతాఫ్రికాతో భారీ ఓటమితో పాకిస్థాన్ టీంలో ఆశలు పెంచింది. న్యూజీలాండ్..పాకిస్థాన్ నాలుగో స్థానం కోసం పోటీ రసవత్తరంగా మారింది. ఈ రెండు జట్లలో సెమీస్ చేరెదోవరో తేలేది ఈ నెల 4న బెంగళూరు మ్యాచ్ లోనే.
పాక్ లో ఆశలు పెంచిన కివీస్: ప్రపంచకప్లో న్యూజిలాండ్ జట్టు ప్రారంభంలో వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి దాదాపు సెమీస్కు చేరువైంది. ఆ తర్వాత ఏమైందో.. గానీ.. కివీస్ జట్టు ఒక్కసారిగా వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు సెమీస్ అవకాశాలపై కారుమబ్బులు కమ్ముకున్నట్లయ్యింది. ఆ జట్టు చివరి రెండు మ్యాచ్లను పాకిస్తాన్, శ్రీలంకలతో తలపడాల్సి ఉంది. ఆ జట్టు నేరుగా సెమీస్కు చేరాలంటే ఈ రెండు మ్యాచుల్లో ఆ జట్టుకు గెలుపు తప్పనిసరి.

మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ప్రారంభంలో రెండు మ్యాచుల్లో ఓడినా.. ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి ఎగబాకింది. ఆసీస్ జట్టు ఇంగ్లండ్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్లతో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లో రెండు మ్యాచ్లు నెగ్గిన ఆసీస్ సెమీస్కు చేరడం ఖాయం.
రెండు జట్ల మధ్య కీలక మ్యాచ్: ఇక పాకిస్తాన్ జట్టు విషయానికొస్తే.. ఆ జట్టు ఆడిన 7మ్యాచుల్లో 4 మ్యాచుల్లో ఓడి సెమీస్కు చేరడమే కష్టమనుకున్న దశలో మూడు మ్యాచుల్లో గెలిచి.. న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో ఆ జట్టూ సెమీస్ రేసులోకి వచ్చింది. న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్లమధ్య 4న బెంగళూరులోని చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
ఆ మ్యాచ్లో ఏ జట్టు గెలిస్తే.. సెమీస్ సమీకరణలు మారనున్నాయి. మరోవైపు పసికూన ఆఫ్ఘనిస్తాన్ జట్టూ (నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా) మిగిలిన 3 మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో గెలిచినా ఆ జట్టూ సెమీస్ రేసులో నిలుస్తుంది. ఇక, రన్ రేటు విషయంలో న్యూజీలాండ్ ప్రస్తుతానికి పాకిస్థాన్ కంటే ఆధిక్యతలో ఉంది. మిగిలిన మ్యాచ్ ల్లోనూ రన్ రేటు కాపాడుకోవాల్సి ఉంటుంది.
హోరా హోరీ సమరం: నాలుగో స్థానంలో ఇప్పుడు పాకిస్థాన్ వర్సస్ న్యూజీలాండ్ జట్లలో ఒక టీంకే ఛాన్స్ దక్కాల్సి ఉంటుంది. ఈ రెండు టీంలు మిగిలిన మ్యాచ్ ల్లో తమ సత్తా చాటటంతో పాటుగా రెండో టీం గెలుపు అవకాశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బెంగళూరు మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తే దాదాపుగా ఆ టీం సెమీస్ కు బెర్తు ఖాయమైనట్లే.
దీంతో, బెంగుళూరు కేంద్రంగా ఈ రెండు జట్ల మ్యాచ్ పైనే ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి. నాలుగో టీంగా వచ్చే జట్లు ఖరారు అయితే, సెమీస్ లో ఎవరు ఎవరితో ఆడుతారనేది స్పష్టత రానుంది. దీంతో, ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉన్న టీమిండియా తొలి స్థానానికి చేరుకొనేందుకు ప్రయత్నిస్తోంది. మారుతున్న లెక్కలతో రాబోయే మ్యాచ్లు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనబడుతోంది.












Click it and Unblock the Notifications