పంజాబ్ కింగ్స్ జట్టులో విభేదాలు..సంచలన నిర్ణయం తీసుకున్న ప్రీతి జింటా
ఐపీఎల్-2025లో ప్లేఆఫ్స్ ఉత్కంఠ పతాక స్థాయికి చేరిన వేళ, పంజాబ్ కింగ్స్ జట్టులో నెలకొన్న అంతర్గత కలహాలు బయటపడి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ అనూహ్య పరిణామం జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోర్టు మెట్లెక్కడంతో సంచలనం రేపింది. ఆమె తన సహ-యజమానులు మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో కేసు వేయడం యావత్ ఐపీఎల్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
పంజాబ్ కింగ్స్ యాజమాన్య సంస్థ అయిన కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రీతి జింటా, మోహిత్ బుర్మాన్, నెస్ వాడియా, కరణ్ పాల్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే, గత నెల 21న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మునీశ్ ఖన్నాను కొత్త డైరెక్టర్గా ఎన్నుకోవడం ఈ వివాదానికి మూలకారణంగా మారింది.

ఈ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రీతి జింటా కోర్టును ఆశ్రయించారు. సర్వసభ్య సమావేశం చట్టబద్ధతను సవాల్ చేస్తూ, కంపెనీ చట్టం 2013 ప్రకారం సరైన విధానాలు పాటించలేదని ఆమె పేర్కొన్నారు. మునీశ్ ఖన్నా నియామకాన్ని తాను, మరో డైరెక్టర్ కరణ్ పాల్ వ్యతిరేకించినప్పటికీ, నెస్ వాడియా మద్దతుతో మోహిత్ బుర్మాన్ సమావేశాన్ని కొనసాగించారని ప్రీతి ఆరోపించారు. అందువల్ల, ఆ మీటింగ్ చెల్లదని తీర్పునివ్వాలని, మునీశ్ ఖన్నా డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టకుండా నిరోధించాలని కోర్టును అభ్యర్థించారు.
అలాగే, ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను నిలిపివేయాలని, కేసు పరిష్కారమయ్యే వరకు తాను, కరణ్ పాల్ లేకుండా మునీశ్ ఖన్నా ప్రమేయం లేకుండా కంపెనీ బోర్డు, సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని ప్రీతి జింటా కోర్టును కోరారు.
యాజమాన్యంలో తీవ్ర వివాదాలు ఉన్నప్పటికీ, ప్రీతి జింటా మాత్రం తన వృత్తి నిబద్ధతను చాటుకుంటూ పంజాబ్ మ్యాచ్లకు హాజరై జట్టుకు మద్దతునివ్వడం విశేషం. ఈ పరిణామం ప్లేఆఫ్స్లో జట్టు ప్రదర్శనపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ప్లేఆఫ్స్కు చేరుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు ఈ అంతర్గత ఒత్తిడిని తట్టుకొని విజయం సాధిస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.












Click it and Unblock the Notifications