పీవీ సింధు ప్రభంజనం: కరవుదీరా: ఫైనల్ లో వీరవిహారం: మొట్టమొదటిసారి
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అంతర్జాతీయ వేదికపై మరో చారిత్రాత్మక ఘనత సాధించారు. ప్రతిష్టాత్మకమైన జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఆదివారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో జపాన్ టాప్ సీడ్ అకానె యామగూచిపై అద్భుత విజయాన్ని అందుకున్నారు. టైటిల్ కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో జపాన్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న మొదటి భారతీయ షట్లర్గా సింధు సరికొత్త రికార్డును నెలకొల్పారు.
గతంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాష్ పదుకొనే 1983లో మాత్రమే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లగలిగారు. ఆ తర్వాత సుదీర్ఘకాలంగా ఏ భారతీయ క్రీడాకారుడు కూడా ఈ వేదికపై ఫైనల్స్ చేరడం గానీ, కప్ కొట్టడం కానీ జరగలేదు. దాదాపు నాలుగు దశాబ్దాల భారీ నిరీక్షణకు తెర దించుతూ సింధు ఈ రికార్డును తిరగరాశారు. వరుస గాయాలు, నిలకడలేని ప్రదర్శనతో సతమతమవుతున్న తరుణంలో ఆమె సాధించిన ఈ విజయం నూతన జోష్ నింపింది.

ఈ ఫైనల్ లో సింధు ఆరంభం నుంచే నెట్ వద్ద చూపించిన మెరుపు వేగం యమగుచిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. మొదటి గేమ్లో అద్భుతమైన డిఫెన్స్తో ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. స్కోరు వరుసగా 12-12, 17-17.. ఇలా ప్రతి పాయింట్ కూడా సమంగా సాగిందంటే వారి పోరు ఈ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దశలో సింధు ఏమాత్రం తడబడలేదు. ఒత్తిడికి గురి కాలేదు. విభిన్నమైన బాడీ స్మాష్, చురుకైన మూవ్మెంట్లతో ఒక్కసారిగా విజృంభించారు. ప్రత్యర్థికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు.
మొదటి గేమ్ను 21-17తో దక్కించుకున్నారు. రెండో గేమ్లోనూ సింధు అదే ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. కోర్టు నలుమూలలా యామగూచిని పరిగెత్తిస్తూ విరామ సమయానికి ఏకంగా ఏకంగా 11-7 ఆధిక్యను సాధించారు. ఈ గేమ్లో 44 షాట్ల లాంగ్ ర్యాలీ మ్యాచ్ మొత్తానికే హైలైట్. ఆ ర్యాలీలన్నీ కూడా సింధు ఖాతాలోనే పడ్డాయి. దీంతో స్కోరు 14-7కు చేరింది. ఆ తర్వాత యామగూచి పుంజుకొన్నారు. వరుస పాయింట్లతో సింధును ఉక్కిరిబిక్కిరికి గురి చేశారు. తన ఆధిక్యతను ఒక్కసారిగా ఏడు నుంచి 18కి పెంచుకున్నారు.
ఒకదశలో సింధుతో సమానంగా అంటే 18-17 తేడాతో నిలిచారు. దీని తర్వాత సింధు మళ్లీ కమ్ బ్యాక్ అయ్యారు. యమగుచికి ఏ మాత్రం కూడా అవకాశమే ఇవ్వలేదు. గ్రౌండ్ షాట్లతో బెంబేలెత్తించార. రెండో సెట్ ను కూడా 21-17తో ముగించారు. జపాన్ ఓపెన్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు. 2019 ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత, పీవీ సింధు కెరీర్లో లభించిన అతిపెద్ద మేజర్ టైటిల్ ఇదే కావడం విశేషం.
దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఈ జపాన్ ఓపెన్ సక్సెస్తో తెరపడింది. గత కొన్నేళ్లుగా పెద్ద టోర్నీలలో టైటిల్స్ గెలవలేకపోయారనే విమర్శలకు ఈ విజయంతో ఒకేసారి అడ్డుకట్ట పడింది. జపాన్కు చెందిన వరల్డ్ డిఫెండర్ను ఆమె సొంత దేశంలో ఓడించడం పీవీ సింధు పట్టుదల, కఠోర శ్రమకు నిదర్శనం. రాబోయే ఒలింపిక్స్ తో పాటు ఇతర ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆమె మరిన్ని పతకాలను సొంతం చేసుకోగలదని నిరూపించిందీ టైటిల్.













Click it and Unblock the Notifications